NRI-NRT

బాలభారతి పాఠశాలకు 10లక్షల విరాళమిచ్చిన కర్నూలు ఎన్నారై ఫౌండేషన్

బాలభారతి పాఠశాలకు 10లక్షల విరాళమిచ్చిన కర్నూలు ఎన్నారై ఫౌండేషన్

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపులక్ష్మీ ఐక్యసంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలకు వరసగా రెండవ సంవత్సరం ₹10లక్షల విరాళాన్ని కర్నూలు NRI ఫౌండేషన్ అందించింది. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‍ రెడ్డి ఈ చెక్కును పాఠశాల కమిటీ అధ్యక్షురాలు విజయలక్ష్మి కి శుక్రవారం జులై 30 నాడు అందజేశారు. అనాధ విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యనందించాలనే లక్ష్యంతో ఈ విరాళాన్ని అందజేస్తున్నట్లు కర్నూలు NRI ఫౌండేషన్‍ వ్యవస్థాపకులు రవి పొట్లూరి తెలిపారు. లాభాపేక్ష లేకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తున్న బాలభారతి పాఠశాలకు భవిష్యత్తులో కూడా తమవంతు సహకారం అందజేస్తామని, పలువురు ఎన్నారైలు ఈ కార్యక్రమానికి తోడ్పడుతున్నట్లు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ప్రవాసుల సేవానిరతిని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‍ రెడ్డి అభినందించారు. కర్నూలు NRI ఫౌండేషన్ స్పూర్తితో జిల్లాకు చెందిన ఎన్నారైలు సామాజిక, సేవా కార్యక్రమాల్లో తమవంతు పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఓర్వకల్లు మండలం పొదుపులక్ష్మీ ఐక్యసంఘం మహిళల కృషితో ఏర్పాటు చేసుకున్నబాలభారతి పాఠశాలకు కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ సహకారం మరువలేనిదని పాఠశాల వ్యవస్థాపకురాలు విజయభారతి తెలిపారు. ఎన్నారైల సహకారంతో విద్య, వైద్య రంగాల్లో సేవలు అందిస్తామని, నిరుద్యోగ యువతలో నైపుణ్యం పెంపొందించే విధంగా శిక్షణా శిబిరాలు, సదస్సులు నిర్వహిస్తామని, జిల్లాకు చెందిన కళాకారులను, మేధావులను, క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని ఫౌండేషన్‍ సమన్వయకర్త ముప్పా రాజశేఖర్ తెలిపారు. ఓర్వకల్లు మండలం పొదుపులక్ష్మీ ఐక్యసంఘం కోశాధికారి విజయలక్ష్మి, సంయుక్త కార్యదర్శి పద్మావతమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.