NRI-NRT

తాలిబన్లకు పాకిస్థాన్-చైనా సానుకూలం-తాజావార్తలు

తాలిబన్లకు పాకిస్థాన్-చైనా సానుకూలం-తాజావార్తలు

* బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ బంద్ నేపథ్యంలో మల్కాజ్‌గిరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. షాపులను తెరవకుండా అడ్డుకుంటున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠిచార్జ్ చేశారు. మల్కాజ్‌గిరి వినాయక నగర్ చౌరస్తా వద్ద బీజేపీ కార్పొరేటర్లు ధర్నాకు దిగారు. పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం.. తోపులాట చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వెంటనే ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

* పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ పై దళిత సంఘాల ఆగ్రహం… వివాదాస్పద వ్యాఖ్యలు పై క్షమాపణ చెప్పాలని డిమాండ్

* అఫ్గానిస్థాన్‌.. ఇప్పుడు తాలిబన్ల రాజ్యం. త్వరలోనే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మతవాదులు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు తాలిబన్ల అరాచక పాలన ఎరిగిన ప్రజలు.. ప్రాణభయంతో దేశం విడిచి పారిపోతున్నారు. దీంతో అఫ్గాన్‌లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలను కొన్ని దేశాలు ఖండిస్తుంటే.. పొరుగుదేశాలైన పాకిస్థాన్‌, చైనా మాత్రం అంగీకరించడం గమనార్హం. తాలిబన్లతో చైనా స్నేహానికి సిద్ధపడగా.. అఫ్గాన్‌కు ఇప్పుడే స్వేచ్ఛ లభించిందని పాక్‌ చెప్పడం.. ఈ దేశాల కుటిల నీతికి అద్దం పడుతోంది.

* బీటెక్‌ విద్యార్థిని రమ్య(20)ను హత్య చేసిన నిందితుడు శశికృష్ణను అరెస్టు చేశామని గుంటూరు పోలీసులు తెలిపారు. సోమవారం రమ్య హత్య కేసు వివరాలను ఇన్‌ఛార్జి డీఐజీ రాజశేఖర్‌బాబు, ఎస్పీలు మీడియాకు వివరించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరు నెలలుగా రమ్య, శశికృష్ణకు పరిచయం ఉందని, తనని ప్రేమించాలని బస్టాండ్‌ వద్ద శశికృష్ణ రమ్యను వేధించేవాడని ఇన్‌ఛార్జ్‌ డీఐజీ రాజశేఖర్‌ వివరించారు. రెండు నెలలుగా వేధింపులు పెరగడంతో శశికృష్ణతో రమ్య మాట్లాడటం మానేసిందని తెలిపారు. ప్రేమించకపోతే చంపుతానని నిందితుడు పలుమార్లు బెదిరించాడన్న డీఐజీ, నిన్న గొడవపడి రమ్యను శశికృష్ణ నరికి చంపాడన్నారు. రమ్య శరీరంపై 6 కత్తిపోట్లున్నాయని, జీజీహెచ్‌కు తీసుకెళ్లే క్రమంలో యువతి చనిపోయినట్లు తెలిపారు.

* గతంలో శాలపల్లిలో ప్రారంభించిన రైతుబంధు అద్భుతమైన ఫలితాలను సాధిస్తోందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న దళితబంధును కూడా ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నామని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ సింహగర్జన కరీంనగర్‌లోనే జరిగిందని గుర్తు చేశారు. మరో అద్భుతమైన కార్యక్రమానికి కరీంనగర్‌లోనే శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. తెలంగాణ సాకారమైనట్లే ఎస్సీల అభివృద్ధి కూడా జరిగి తీరాలన్నారు. శాలపల్లిలో దళితబంధు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. దళితబంధు పథకంతో మరో నాలుగేళ్లలో అద్భుత ఫలితాలు వస్తాయన్నారు. ఏడాది క్రితమే ఈ పథకాన్ని ప్రారంభించాలని అనుకున్నానని, కానీ, కరోనా కారణంగా ఏడాది ఆలస్యమైందని కేసీఆర్‌ అన్నారు.

* హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వచ్చిన సందర్భంగా గుంటూరులోని పరమయ్యగుంట వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాజకీయ లబ్ధికోసమే లోకేశ్‌ వచ్చారంటూ వైకాపా శ్రేణులు అక్కడికి చేరుకుని ఆరోపించాయి. ఈ క్రమంలో తెదేపా-వైకాపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

* దళిత బంధు పథకం ప్రారంభం సందర్భంగా హుజూరాబాద్‌ సభలో సీఎం కేసీఆర్‌ అన్నీ అబద్ధాలే చెప్పారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. అబద్ధాల పునాదుల మీద బీటలు వారుతున్న గులాబీ కోటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్‌కు ఇదే చివరి రాజకీయ ప్రసంగంగా భావిస్తున్నామన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 18న ఇబ్రహీంపట్నం దళిత, గిరిజనసభ తర్వాత హుజూరాబాద్‌పై పూర్తిగా దృష్టి సారించనున్నట్లు వివరించారు. కేసీఆర్‌ సభ పెట్టిన స్థలంలోనే కాంగ్రెస్‌ సభ పెడతామని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

* సిరిసిల్ల అంబేడ్కర్ చౌరస్తాలో తెరాస-భాజపా నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దళితబంధు కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా తెరాస నేతలు అంబేడ్కర్ చౌరస్తాలో ఉత్సవాలు చేస్తుండగా.. అదే సమయంలో భాజపా నేతలు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు దిష్టిబొమ్మతో అక్కడికి చేరుకున్నారు. దీంతో రెండు పార్టీల నాయకుల మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో ఒకరిపైఒకరు దాడులు చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు పార్టీల నేతలకు సర్దిచెప్పి పంపించారు.

* ద‌ళిత బంధు ప‌థ‌కం ప్రారంభోత్స‌వ వేదిక‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌స్తుతం ఎస్సీ సంక్షేమ‌ శాఖ సెక్ర‌ట‌రీగా ఉన్న రాహుల్ బొజ్జాను సీఎంవోలో సెక్ర‌ట‌రీగా నియ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. రాహుల్ బొజ్జా ద‌ళితుడే. వాళ్ల నాన్న‌ బొజ్జా తార‌కం.. ఉద్య‌మంలో ప‌ని చేసిన వారికి న్యాయవాదిగా ఉండే. గొప్ప న్యాయ‌వాది. ఆయ‌న కుమారుడే రాహుల్ బొజ్జా. రాహుల్ బొజ్జా ఎస్సీ వెల్ఫేర్ సెక్ర‌ట‌రీగా ఉండ‌ట‌మే కాదు.. ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలోనే సెక్ర‌ట‌రీగా ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాను. ఆయ‌న ఆదేశాల‌న్నీ అమ‌లు కావాలె. రేప‌ట్నుంచి నా కార్యాల‌యంలో సెక్ర‌ట‌రీగా ఉంటారు అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

* శ్రీవారి ఖజానాకు రూ. 13,05,116 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ.1,96,956, రూ. 100 దర్శనంతో రూ. 27,400, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 80,850, సుప్రభాతం ద్వారా రూ. 1,600, నిత్య కైంకర్యాలతో రూ. 5,502, క్యారీబ్యాగులతో రూ. 3,300, సత్యనారాయణ వ్రతాల ద్వారా రూ. 78,000, కల్యాణకట్టతో రూ. 31,000, ప్రసాద విక్రయంతో రూ. 4,96,875,

* ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమల శాఖ (ఫుడ్ ప్రాసెసింగ్ ) కార్యదర్శిగా ముకేశ్ కుమార్ మీనా, గవర్నర్ స్పెషల్ సీఎస్‌గా ఆర్పీ సిసోడియా బదిలీ అయ్యారు. స్టేట్ ట్యాక్స్‌ చీఫ్‌ కమిషనర్‌గా రవిశంకర్‌ నారాయణ్‌ బదిలీ కాగా, పీయూష్ కుమార్ జీఏడీకి బదిలీ అయ్యారు. సీసీఎస్‌ఏ అప్పీల్స్ కమిషనర్‌గా లక్ష్మీనరసింహం, సీసీఎల్‌ఏ జాయింట్ సెక్రటరీగా హరిజవహర్‌లాల్‌లకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.