WorldWonders

ఏపీలో డ్రగ్స్ మాఫియా-తాజావార్తలు

ఏపీలో డ్రగ్స్ మాఫియా-తాజావార్తలు

* టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై చేసిన తీవ్ర వ్యాఖ్యల్లో రేవంత్‌ తప్పు లేదని.. తప్పంతా తనదేనని ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఒప్పుకొన్నారు. నిన్న తాను మీడియా ముందు వచ్చి నేరుగా మాట్లాడటం తప్పని.. తన తప్పును ఒప్పుకొని పార్టీకి క్షమాపణ చెప్పారు. రేవంత్‌రెడ్డి, తాను అన్నదమ్ముల్లాంటి వాళ్లమని తెలిపారు. మీడియా ముందు అలా మాట్లాడొద్దని పార్టీ ఇంఛార్జి చెప్పారని పేర్కొన్నారు. ఇక నుంచి నేరుగా పార్టీ వ్యవహారాలు మీడియాతో మాట్లాడనని జగ్గారెడ్డి వెల్లడించారు.

* ఏపీలో డ్రగ్స్‌ మాఫియా నడుస్తోందని తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. దీని వెనుక ఎవరున్నారో డీజీపీ తేల్చాలని డిమాండ్‌ చేశారు. తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏం అంశంపై అయినా తెదేపా సాక్ష్యాధారాలతో మాట్లాడుతుందని.. ఈ విషయాన్ని డీజీపీ గుర్తుంచుకోవాలన్నారు.

* తెలంగాణ ఆవిర్భవించి ఏడేళ్లయినా ఇంత వరకూ రాష్ట్రానికి క్రీడా పాలసీ లేదని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం స్టేడియాలను ప్రైవేటు వ్యాపార సంస్థలకు ధారాదత్తం చేస్తోందని ఆరోపించారు. భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గచ్చిబౌలి స్టేడియాన్ని టిమ్స్‌కు ఇవ్వడాన్ని భాజపా వ్యతిరేకిస్తోందని చెప్పారు.

* సివిల్ సర్వీస్‌ పరీక్షలో ర్యాంకులు సాధించి విజేతలుగా నిలిచిన అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ‘మీరంతా ప్రతిభావంతులు. మరికొన్నిసార్లు ప్రయత్నించే వీలుంది. అలాగే భారత్ అనేక విభిన్న అవకాశాలకు నెలవు. వాటిని అన్వేషించడానికి వేచి చేస్తోంది. మొత్తానికి మీరు విధించుకున్న లక్ష్యాన్ని సాధించాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

* అఫ్గానిస్థాన్‌లో పాలనను చేజిక్కించుకున్న తాలిబన్లు.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని భారత్‌, అమెరికా సూచించాయి. మహిళలు, చిన్నారులు సహా పౌరుల హక్కులను గౌరవించాలని హితవు పలికాయి. అఫ్గాన్‌ను ఉగ్రవాదుల శిక్షణకు స్థావరంగా మార్చొద్దని తేల్చి చెప్పాయి. ఇతర దేశాలకు ముప్పు తలపెట్టే శక్తులకు అఫ్గాన్ భూభాగాన్ని కేంద్రంగా మార్చొద్దని సూచించాయి.

* ప్రపంచ శాంతిలో కీలక పాత్ర పోషిస్తున్న భారత్‌కు ‘ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్సీ)’లో శాశ్వతసభ్యత్వం కల్పించాలన్న డిమాండ్‌కు మద్దతు పెరుగుతోంది. తాజాగా ఈ ప్రతిపాదనపై అమెరికా సైతం సానుకూలంగా స్పందించింది. స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ భారత్‌కు శాశ్వతసభ్యత్వం ఉండాలని ఉద్ఘాటించినట్లు విదేశాంగశాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా తెలిపారు.

* ‘పాకిస్థాన్.. తనను తాను ఉగ్రవాద బాధిత దేశంగా చెప్పుకొంటోంది.. కానీ ఆ దేశం ఇంటికి నిప్పు పెట్టి తిరిగి అవే మంటల్ని ఆర్పే వ్యక్తిలా నటిస్తోంది.. అమెరికా జంట భవనాలపై ఉగ్రదాడికి పాల్పడిన ఒసామా బిన్‌లాడెన్‌కు ఆశ్రయమిచ్చింది.. తనవైపు ఇన్ని తప్పులు పెట్టుకొని అంతర్జాతీయ వేదికగా అవాస్తవాలు ప్రచారం చేస్తోంది’.. అంటూ పదునైన వ్యాఖ్యలతో పాకిస్థాన్‌కు ఐరాస వేదికగా దిమ్మతిరిగిపోయే బదులిచ్చింది మనదేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన స్నేహా దూబే.

* టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ తన ప్రియురాలితో విడిపోయారా? మూడేళ్ల తమ బంధానికి స్వస్తి పలికాడా? అనే ప్రశ్నకు అంతర్జాతీయ మీడియా అవుననే అంటోంది. 2018 నుంచి గ్రైమ్స్‌ అనే యువతితో ఎలాన్‌ మస్క్‌ డేటింగ్‌లో ఉన్నాడు. వారికి ఏడాది వయసు గల కుమారుడు ఉన్నాడు. కాగా ఈ జంట విడిపోయినట్లు ‘పేజ్‌ సిక్స్‌’ అనే వార్తా సంస్థ వెల్లడించింది.

* ‘నగదు మారకం వద్దు.. ఈ-కామర్స్‌ (ఆన్‌లైన్‌ చెల్లింపులు) ముద్దు’ అంటూ ప్రభుత్వాలు చేస్తున్న ప్రచారం బ్రిటన్‌లో కార్మికుల కడుపు కొడుతోంది. దేశంలో 80 శాతం బిల్లులు కార్డుల ద్వారానే (టిప్పుతో కలిపి) చెల్లిస్తున్నారు. రెస్టారెంట్లు, కేఫ్‌లు, పబ్బుల యజమానులు చాలామంది ఈ టిప్పులను తిరిగి కార్మికులకు ఇవ్వడం లేదని ఇటీవల చేపట్టిన ఓ అధ్యయనంలో తేలింది.

* విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టులో ఏదో సమస్య ఉందని, లేకపోతే ఇలా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో అంత మంచి ఆరంభం దక్కినా ఓటమిపాలవ్వడం సరికాదని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ విశ్లేషించాడు. శుక్రవారం రాత్రి చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడిన మ్యాచ్‌లో బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

* నగరంలోని రాయదుర్గం టెలిఫోన్‌ కాలనీలో జరిగిన చోరీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నేపాల్‌కు చెందిన లక్ష్మణ్, పవిత్ర దంపతులను షోలాపూర్‌ రైల్వేస్టేషన్‌ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.7.2లక్షల నగదు, 1.1 కేజీల బంగారు, వజ్రాభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదైన వెంటనే స్పందించామని, నాలుగు బృందాలు ఏర్పాటు చేసి నాలుగు రాష్ట్రాలకు పంపించామని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. సాంకేతిక ఆధారాలు సహా పక్కా సమాచారంతో నిందితులను షోలాపూర్‌ రైల్వే స్టేషన్‌ వద్ద పట్టుకున్నామని వెల్లడించారు.

* జూబ్లీహిల్స్‌లో శనివారం సాయంత్రం భారీ చోరీ జరిగింది. నగరానికి చెందిన స్థిరాస్తి వ్యాపారి సంతోష్‌రెడ్డి.. మరో స్థిరాస్తి వ్యాపారికి ఇవ్వమని చెప్పి డ్రైవర్‌ శ్రీనివాస్‌కు రూ.55లక్షలు ఇచ్చారు. కానీ శ్రీనివాస్‌ ఆ డబ్బు స్థిరాస్తి వ్యాపారికి ఇవ్వకుండా రూ.55లక్షలు, కారుతో సహా ఉడాయించాడు. సంతోష్‌ ఫోన్‌చేయగా.. శ్రీనివాస్‌ సెల్‌ఫోన్‌ స్విచాఫ్‌ అని వస్తోంది. దీంతో బాధితుడు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

* వ్యాక్సినేషన్‌ పూర్తయి, విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయుల కోసం ‘కొవిన్‌’లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో పూర్తి పుట్టిన తేదీ పొందుపర్చిన ‘కొవిన్‌’ సర్టిఫికేట్లు జారీ చేయనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ ప్రమాణాల విషయంలో ఇటీవల భారత్‌, బ్రిటన్‌ మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ధ్రువపత్రంలో వ్యక్తి వయస్సు మాత్రమే నమోదవుతోంది. దీనికి పరిష్కారంగా.. డబ్ల్యూహెచ్‌వో నిబంధనలకు అనుగుణంగా పుట్టిన తేదీతో కూడిన టీకా సర్టిఫికేట్లు వచ్చే వారం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ‘కొవిన్‌ యాప్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించాం. ఈ క్రమంలో వ్యాక్సినేషన్‌ పూర్తయి, విదేశాలకు వెళ్లాలనుకునేవారి టీకా ధ్రువపత్రంపై పుట్టిన తేదీ కూడ ఉంటుంది’ అని ఓ అధికారి వివరించారు. భారత్‌లో తయారుచేసిన కొవిషీల్డ్‌ టీకాతో తమకు ఎలాంటి సమస్య లేదని, వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌తోనే సమస్య ఉందని ఇటీవల బ్రిటన్‌ ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ ధ్రువపత్రాలకు కనీస ప్రమాణాలుండాలని వ్యాఖ్యానించింది. ఈ విషయమై కొవిన్‌ యాప్‌, ఎన్‌హెచ్‌ఎస్‌ యాప్‌ రూపకర్తలతో చర్చలు జరుపుతున్నట్లు బ్రిటన్‌కు బ్రిటన్‌ హైకమిషనర్‌ అలెక్స్‌ ఎల్లిస్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారత్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.