Sports

పాకిస్థాన్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం

పాకిస్థాన్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం

న్యూజీలాండ్‌లో జ‌రుగుతున్న‌ మ‌హిళల ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీలో దాయాది పాకిస్థాన్ జ‌ట్టుపై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. మౌంట్ మాంగ‌నుయ్‌లో జ‌రిగిన త‌న తొలి మ్యాచ్‌లోనే భారీ విజ‌యంతో భార‌త్ ప్ర‌పంచ‌క‌ప్‌ టోర్నీని మొద‌లుపెట్టింది. ఏకంగా 107 ప‌రుగుల తేడాతో పాకిస్థాన్ జ‌ట్టును మ‌ట్టి క‌రిపించింది.ముందుగా బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 244 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో పూజా వ‌స్త్రేక‌ర్ 67, స్నేహ్ రాణా 53 అర్ధ సెంచ‌రీల‌తో రాణించారు. పాకిస్థాన్ బౌల‌ర్ల‌లో న‌శ్రా సంధు, నిడా ద‌ర్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. అనంత‌రం 245 ప‌రుగుల భారీ ల‌క్ష్య ఛేద‌న కోసం బ‌రిలో దిగిన పాకిస్థాన్ ఆదిలోనే త‌డ‌బ‌డింది. టాప్ ఆర్డ‌ర్ ట‌పీట‌పీమ‌ని కుప్ప‌కూల‌డంతో పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది.దాంతో పాకిస్థాన్ 43 ఓవ‌ర్ల‌లో 137 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. భార‌త బౌల‌ర్ రాజేశ్వ‌రి గైక్వాడ్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టి పాకిస్థాన్ న‌డ్డి విరిచింది. ఇక పాకిస్థాన్ బ్యాట‌ర్ల‌లో సిద్రా అమీన్ మాత్ర‌మే 30 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచింది. పూజా వ‌స్త్రేక‌ర్‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది.