టూరిస్ట్ వీసాల విషయమై కువైత్లోని భారత రాయబార కార్యాలయం తాజాగా కీలక ప్రకటన చేసింది. టూరిస్ట్ వీసాలు(మల్టీపుల్ ఎంట్రీ వీసాలతో సహా) కావాలనుకునే కువైటీలు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. భారత్లో కరోనా పరిస్థితులు అదుపులోకి రావడం, ప్రభుత్వం ప్రయాణ ఆంక్షలను తొలగించిన నేపథ్యంలో టూరిస్ట్ వీసాలను జారీ చేసేందుకు సిద్ధమైనట్లు మీడియా సమావేశంలో ఎంబసీ వెల్లడించింది. పర్యాటక వీసాల కోసం అవసరమైన ధృవపత్రాలు, వీసా రుసుముతో ఎంబసీకి చెందిన బీఎల్ఎస్ ఇంటర్నెషనల్ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే, దరఖాస్తుదారు స్వయంగా బీఎల్ఎస్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.
ఎందుకంటే.. దరఖాస్తుదారు ఫొటో, బయోమెట్రిక్ వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. కువైట్ సిటీలోని అలీ అల్ సలేం స్ట్రీట్ జవహార టవర్ మూడో అంతస్తులోని బీఎల్ఎస్ కేంద్రంలో దరఖాస్తు సమర్పించాలి. అలాగే ఆలివ్ సూపర్ మార్కెట్ బిల్డింగ్ జ్లీబ్ అల్ షుయూక్ మరియు అల్ అనౌద్ షాపింగ్ కాంప్లెక్స్ మెజ్జనైన్ ఫ్లోర్లో ఉన్న బీఎల్ఎస్ సెంటర్తో పాటు మక్కా స్ట్రీట్లోని ఫహాహీల్ కేంద్రంలో కూడా శనివారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాల కోసం బీఎల్ఎస్ ఇంటర్నెషనల్ వెబ్సైట్ https://www.blsindiakuwait.com/visa/requirements.php లో చూడొచ్చు.