*షార్లో పీఐఎఫ్ ప్రాజెక్టు పనులు పూర్తి
*వచ్చే నెలలో ప్రారంభానికి సన్నాహాలు
*వ్యయం రూ.471 కోట్లు
తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లో (షార్) మరో భారీ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. దీనిని వచ్చే నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఏడాదిన్నర కిందటే సిద్ధం కావాల్సి ఉండగా.. కొవిడ్ విజృంభణతో పనుల్లో జాప్యం జరిగింది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇక్కడి నుంచి ఏటా 15 పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) ప్రయోగాలు చేపట్టేలా ఇస్రో ప్రణాళికలు రచించింది. ఇందుకుగానూ కొత్త ప్రయోగ వేదిక నిర్మాణం చేపట్టకుండా ఉన్న దాంట్లోనే మరిన్ని వసతులు ఏర్పాటు చేసి అందుబాటులోకి తెచ్చేలా రూపకల్పన చేశారు. ఈ నేపథ్యంలో మొదటి ప్రయోగ వేదికను పూర్తి స్థాయిలో ఆధునికీకరించాలని 2018లో భావించారు. ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో రూ.471 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో పీఐఎఫ్ (పీఎస్ఎల్వీ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ) పనులు 2019లో ప్రారంభించారు.