Business

ముంబైలో ఇళ్లు కాస్ట్‌లీ గురూ…

ముంబైలో ఇళ్లు కాస్ట్‌లీ గురూ…

అహ్మదాబాద్‌లో మాత్రం చవక జూ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదిక వెల్లడి న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇళ్ల ధరలు చుక్కలంటుతున్నాయి. అక్కడ అప్పు చేసి ఇల్లు కొనాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ఒకవేళ కొన్నా.. కొన్నవారి నెలవారీ ఆదాయంలో సగటున 56 శాతం ఈఎంఐలకే పోతోంది. అఫర్డబులిటీ ఇండెక్స్‌ పేరుతో నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా విడుదల చేసిన ఒక నివేదిక ఈ విషయం పేర్కొంది. గత ఆరు నెలల్లో హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరుతో సహా దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు, ఈఎంఐలను పరిశీలించి ఈ నివేదిక రూపొందించారు. హైదరాబాద్‌లో 31 శాతం: ముంబై తర్వాత హైదరాబాద్‌లో ఇళ్ల ధర ఎక్కువగా ఉంది. ఇక్కడ వ్యక్తుల ఆదాయంలో సగటున 31 శాతం ఈఎంఐల చెల్లింపులకే పోతోంది. అహ్మదాబాద్‌ రియల్టీ మాత్రం ఇప్పటికీ అత్యంత చౌకగా ఉంది. అక్కడ ఒక వ్యక్తి నెలవారీ ఆదాయంలో సగటున 22 శాతం మాత్రమే గత ఆరు నెలల్లో గృహ రుణ ఈఎంఐల చెల్లింపునకు ఖర్చు చేస్తున్నారు. గత మూడేళ్ల నుంచి అహ్మదాబాద్‌ ఈ విషయంలో ముందుంది. అక్కడ ఇళ్ల ధరల కంటే ప్రజల ఆదాయాలు ఎక్కువగా పెరగడం ఇందుకు కారణమని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది.
*వడ్డీ రేట్ల దెబ్బ:
ఆర్‌బీఐ రెపో రేటు 90 బేసిస్‌ పాయింట్లు పెంచిన ప్రభావం.. అందుబాటు ధరల ఇళ్లపైనా కనిపిస్తోంది. దీంతో ఈఎంఐల భారం సగటున 6.97 శాతం పెరిగితే, నెలవారీ ఆదాయంలో ఈఎంఐల కోసం ఖర్చు చేసే మొత్తం 2 నుంచి 3 శాతం పెరిగింది.