పుట్టింది వెనకబడ్డ ఒడిశా రాష్ట్రంలో. అందులోనూ, దేశంలోకెల్లా అత్యంత వెనకబడ్డ జిల్లాలో. ఎలాంటి సౌకర్యాలకూ నోచని అత్యంత కుగ్రామంలో. అది కూడా అత్యంత వెనకబడిన సంతాల్ గిరిజన కుటుంబంలో. అలా అత్యంత అట్టడుగు స్థాయి నుంచి మొదలైన ద్రౌపదీ ముర్ము జీవన ప్రస్థానం అత్యున్నతమైన రాష్ట్రపతి పీఠం దాకా సాగిన తీరు ఆద్యంతం ఆసక్తికరం.
*సౌకర్యాల లేమిని అధిగమించడంలో ఎంతటి అసమాన పట్టుదల కనబరిచారో వ్యక్తిగత జీవితంలో ఎదురైన పెను విషాదాలను తట్టుకోవడంలోనూ అంతకు మించిన మనో నిబ్బరం చూపారామె. అన్నింటికీ మించి ఎదిగిన కొద్దీ అంతకంతా ఒదిగుతూ వచ్చారు. వినమ్రతకు పర్యాయ పదంలా నిలిచారు. నెలకు కేవలం 10 రూపాయలతో కాలేజీ జీవితం గడుపుకున్నప్పుడు ఎంత నిరాడంబరంగా ఉన్నారో, 2021లో జార్ఖండ్ గవర్నర్గా పదవీ విరమణ చేశాక కూడా అంతే నిరాడంబరత ప్రదర్శించారు.
*స్వస్థలానికి తిరిగొచ్చి భర్త కట్టించిన సాదాసీదా ఇంట్లోనే మామూలు జీవితం గడిపారు. అంతటి నిగర్వి ముర్ము. జార్ఖండ్ గవర్నర్గా కూడా వివాదరహితంగా బాధ్యతలను నిర్వర్తించిన సౌమ్యురాలు. అధికార కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన ఆమెకు విపక్షాల ఓట్లు కూడా గణనీయంగా పడేందుకు గిరిజన నేపథ్యంతో పాటు ఈ ప్రవర్తన కూడా కారణమైంది.
*ద్రౌపదీ ముర్ము ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా ఉపర్బేడ గ్రామంలో 1958 జూన్ 20వ తేదీన జన్మించారు. ఆమె తండ్రి బిరంచి నారాయణ్ తుడు. పట్టుదలతో స్కూలు చదువు, తర్వాత భువనేశ్వర్లో కాలేజీ చదువు పూర్తి చేశారు. తర్వాత జూనియర్ అసిస్టెంట్గా జీవితం మొదలు పెట్టారు. స్కూల్ టీచర్గా, రాయ్రంగాపూర్లోని శ్రీ అరబిందో ఇంటెగ్రల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేశారు. 1997లో బీజేపీలో చేరారు. రాయ్రంగాపూర్ నగర పంచాయతీ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. 2000లో చైర్పర్సన్ అయ్యారు. బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా, తర్వాత బీజేపీ–బీజేడీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. 2015లో జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్ అయ్యారు.
పేరు: ద్రౌపది ముర్ము
పుట్టిన తేదీ: జూన్ 20, 1958
పుట్టిన ఊరు: ఉపర్బేడ, మయూర్భంజ్, ఒడిశా
వయస్సు: 64 ఏళ్లు
తండ్రి: బిరంచి నారాయణ్ తుడు
రాజకీయ పార్టీ: బీజేపీ
చదువు: రమాదేవి విమెన్స్ యూనివర్సిటీ నుంచి బీఏ
చేపట్టిన పదవులు: జార్ఖండ్ గవర్నర్, ఒడిశా రాష్ట్ర మత్స్య, పశుసంవర్థక, వాణిజ్యం, రవాణా శాఖలు
సంతానం: ఇతిశ్రీ ముర్ము (బ్యాంకు ఉద్యోగి)
భర్త: శ్యాం చరణ్ ముర్ము (2014లో మృతి)
*తీరని విషాదాలు…
ముర్ము వ్యక్తిగత జీవితంలో తీరని విషాదాలున్నాయి. బ్యాంక్ ఉద్యోగి అయిన శ్యామ్ చరణ్ ముర్మును ఆమె పెళ్లాడారు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. 2009–15 మధ్య కేవలం ఆరేళ్ల వ్యవధిలో భర్తతో పాటు ఇద్దరు కొడుకులను, తల్లిని, సోదరుడినీ కోల్పోయారు. ఈ విషాదం తనను ఆధ్యాత్మిక బాట పట్టించిందని 2016లో దూరదర్శన్ ఇంటర్వ్యూలో గుర్తుకు తెచ్చుకున్నారు. ‘‘అప్పట్లో పూర్తిగా కుంగిపోయి తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లాను. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. అప్పుడే బ్రహ్మకుమారీల ఆశ్రమాన్ని సందర్శించాను. నా కుమార్తె కోసం జీవించాలని నిర్ణయించుకున్నాను’’ అని చెప్పారు.
*ముర్ము చరిత్ర సృష్టించారు
అత్యున్నత పదవికి ఎన్నికైన గిరిజన బిడ్డగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. ఆమె గొప్ప రాష్ట్రపతిగా పేరు సంపాదిస్తారు. ఆమె పేదలు, అణగారిన వర్గాల ఆశారేఖగా ఉద్భవించారు. 130 కోట్ల మంది దేశ ప్రజలు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’జరుపుకుంటున్న వేళ గిరిజన బిడ్డ రాష్ట్రపతి పదవికి ఎన్నిక కావడం గొప్ప విషయం. మారుమూల కుగ్రామంలో జన్మించిన ముర్ము సాధించిన విజయాలు దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకం. ముర్ముకు మద్దతుగా నిలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు మోదీ కృతజ్ఞతలు. – ప్రధాని నరేంద్ర మోదీ
**అంతా ఊహించినట్టుగానే కౌంటింగ్ ప్రారంభం నుంచే సిన్హాపై ముర్ము నిర్ణాయక ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చారు. ప్రతి రౌండ్లోనూ దాదాపు మూడింట రెండొతుల ఓట్లతో దూసుకెళ్లారు. మూడో రౌండ్లోనే 50 శాతం ఓట్లు దాటేసి విజయానికి అవసరమైన మెజారిటీ మార్కు సాధించారు. అప్పటికి మరో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఓట్ల లెక్కింపు మిగిలే ఉంది. చివరిదైన నాలుగో రౌండ్ కౌంటింగ్ ముగిశాక ముర్ము విజయాన్ని చీఫ్ రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరించిన రాజ్యసభ సెక్రెటరీ జనరల్ పీసీ మోదీ అధికారికంగా ప్రకటించారు. ఆమెకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం సర్టిఫికెట్ అందజేయనుంది.
* మొత్తం 776 మంది ఎంపీలు, 4,033 మంది ఎమ్మెల్యేలు కలిపి ఎలక్టోరల్ కాలేజీలో 4,809 మంది సభ్యులున్నారు. వీరిలో4,754 మంది ఓటేశారు. వారి మొత్తం ఓట్ల విలువ 10,72,377.
*వాటిలో ముర్ము 64.03 శాతం ఓట్లు సాధించగా సిన్హా 36 శాతంతో సరిపెట్టుకున్నారు. ముర్ముకు 6,76,803 పోలవగా సిన్హాకు 3,80,177 పడ్డాయి.
* 2,824 మంది ప్రజాప్రతినిధులు ముర్ముకు, 1,877 మంది సిన్హాకు ఓటేశారు.
* 15 మంది ఎంపీలతో పాటు మొత్తం 53 మంది ఓట్లు చెల్లకుండా పోయాయి.
*ఎంపీల ఓట్లలో 540 (72.19 శాతం) ముర్ముకే పడ్డాయి. సిన్హాకు 208 మంది ఓటేశారు.
* గిరిజన బిడ్డ అయిన ముర్ముకు విపక్షాలకు చెందిన పలువురు గిరిజన, ఎస్సీ ప్రజాప్రతినిధులు కూడా జైకొట్టారు.
*17 మంది ఎంపీలతో పాటు దాదాపు 125 మందికి పైగా విపక్ష ఎమ్మెల్యేలు ముర్ముకు ఓటేసినట్టు తేలింది.
* అస్సాంలో 22 మంది ఎమ్మెల్యేలు, మధ్యప్రదేశ్లో 20, మహారాష్ట్రలో 16, గుజరాత్లో 10, జార్ఖండ్లో 10, బిహార్లో 6,, ఛత్తీస్గఢ్లో 6, గోవాలో నలుగురు చొప్పున విపక్ష ఎమ్మెల్యేలు ముర్ముకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారు.
* ముర్ముకు యూపీ, మహారాష్ట్ర, ఏపీల నుంచి ఆమెకు అత్యధిక ఓట్లు వచ్చాయి. సిన్హాకు పశ్చిమబెంగాల్, తమిళనాడు నుంచి అత్యధిక ఓట్లు పడ్డాయి.
*ఆంధ్రప్రదేశ్, సిక్కింలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలంతా, నాగాలాండ్లో మొత్తం ఎమ్మెల్యేలూ ముర్ముకే ఓటేయడం విశేషం!
*కేరళ నుంచి దాదాపుగా అన్ని ఓట్లూ సిన్హాకే పడ్డాయి.
*ద్రౌపది ముర్ము ప్రస్థానం
నిరాడంబరమైన నేపథ్యం నుంచి వచ్చిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పదవి వరకు సాధించిన ఔన్నత్యం.. భారతదేశం నాగరికత, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం పట్ల ఉన్న స్థిరమైన విశ్వాసానికి నిదర్శనంగా మారాయి. ద్రౌపది ముర్ము 1958, జూన్ 20న ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బైడపోసిలో జన్మించారు. భువనేశ్వర్లోని రమాదేవి ఉమెన్స్ కాలేజీ నుంచి బీఏ పూర్తి చేశారు. స్కూల్ టీచర్గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత రాష్ట్ర నీటిపారుదల, విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేశారు. ద్రౌపది ముర్ము భర్త పేరు శ్యామ్ చరణ్ ముర్ము. ఆమెకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు టీచర్ గా పనిచేశారు.
*రాజకీయ జీవితం
1997లో రాయ్రంగాపూర్ నగర పంచాయతీ కౌన్సిలర్గా ఎన్నికవడంతో ముర్ము రాజకీయ జీవింతం మొదలైంది. 2000లో రాయ్రంగాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేడీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. రవాణా, వాణిజ్య, మత్స్య, పశుసంవర్ధక శాఖలు నిర్వహించారు. అంతకుముదు ఒడిశా బీజేపీ గిరిజన మోర్చాకు ఉపాధ్యక్షురాలిగా, అధ్యక్షురాలిగా చేశారు. 2010, 2013ల్లో మయూర్భంజ్జిల్లా బీజేపీ విభాగం ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా చేశారు.
*విషాదాలను దిగమింగుకొని
నేడు దేశ అత్యున్నత స్థానంలో కూర్చోబోతున్న ద్రౌపది ముర్ము.. తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను, విషాదాలను ఎదుర్కొన్నారు. 2009లో పెద్ద కొడుకు అనుమానస్పద స్థితిలో మృతి చెందగా.. 2012లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండో కొడుకు మరణించాడు. ఈ విషాదాల నుంచి తెరుకునేలోపే 2014లో భర్త శ్యామ్ చరణ్ గుండెపోటుతో ప్రాణాలు విడిచారు.. కుటుంబంలోని ముగ్గురి మరణం ద్రౌపది ముర్ము జీవితంలో పెను విషాదాన్ని నిపింది.ఇద్దరు కమారులు, భర్తను పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిపోయిన ఆమె.. కూతురు, తమ్ముడి అండతో మళ్లీ ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. 2015లో జార్ఖండ్ గవర్నర్ అయ్యారు. రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ ద్రౌపది ముర్మునే. ఇప్పుడు దేశ అత్యుతన్నత రాజ్యాంగ పదవికి ఎన్నికై.. ఆ గౌరవం పొందిన తొలి ఒడిశావాసిగా, మొట్టమొదటి ఆదివాసీ మహిళగా చరిత్ర సృష్టించారు.