DailyDose

ఘోర ప్రమాదం

ఘోర ప్రమాదం

నదిలోయలోకి దూసుకెళ్లిన విమానం

32 మంది మృతి

కుప్పకూలిన విమానం

నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయం లోని రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా ఓ విమానం అదుపుతప్పి నదిలోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 32 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. 72 సీట్ల సామర్థ్యం కలిగిన యెటి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదం పాత విమానాశ్రయానికి పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయానికి మధ్య జరిగినట్లు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రస్తుతం విమానాశ్రయాన్ని మూసివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో నుంచి మృతదేహాలను బయటకు తీస్తున్నట్లు చీఫ్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫీసర్‌ తెక్‌ బహదూర్‌ కేసీ స్థానిక పత్రికలకు వెల్లడించారు. ఈ విమానంలోని వారు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడే అవకాశాలు చాలా తక్కువని ఆయన వ్యాఖ్యానించారు. విమాన ప్రమాదం జరిగిన చోట భారీగా మంటలు చెలరేగడంతో భద్రతా సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు.

విదేశీయులు సైతం

ఈ ప్రమాదంలో విమానానికి చెందిన ఒక్క రెక్క తప్ప మొత్తం కాలిపోయింది. ఇప్పటికీ ఘటనా స్థలంలో మంటలు ఎగసిపడుతున్నాయి. ఇప్పటి వరకు ఎవరినీ కాపాడలేకపోయినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ విమానంలో ఐదుగురు భారతీయులు ఉన్నారు. మొత్తంగా 53 మంది నేపాలీలు, నలుగురు రష్యన్లు, ఇద్దరు కొరియన్లు, ఐర్లాండ్, అర్జెంటీనా, ఫ్రాన్స్​ దేశాలకు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నట్లు ఎయిర్​పోర్ట్ అథారిటీ వెల్లడించింది.

విచారం వ్యక్తం చేసిన ప్రధాని

ఈ విమాన ప్రమాదంపై నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ విచారం వ్యక్తం చేశారు. అత్యవసర మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భద్రతా దళాలు, హోంశాఖ వెంటనే సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.