Politics

అయ్యో కేటీఆర్ సార్…వార్తలు చూస్తలేరా!

అయ్యో కేటీఆర్ సార్…వార్తలు చూస్తలేరా!

అయ్యో కేటీఆర్ సార్.. వార్తలు చూడటం లేదా.. ఈ డైలాగ్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది.. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. దీనికి కారణం లేకపోలేదు.. గుజరాత్ రాష్ట్రంలో మద్యం తాగి మనుషులు చనిపోయిన వార్తను వీ6 వాళ్లు ప్రసారం చేశారా..? అంటూ ప్రెస్ మీట్ లో.. వీ6, వెలుగు ప్రతినిధులతో వెటకారాలు ఆడారు మంత్రి.

రాజకీయంగా తనకు ఉన్న కోపం, అక్కసు ఏమో కానీ.. వాస్తవం మాత్రం మరోలా ఉంది. మంత్రి కేటీఆర్ ప్రస్తావించిన గుజరాత్ లిక్కర్ మరణాల వార్తను వీ6 న్యూస్ ఒకటి కాదు రెండు కథనాలను ప్రసారం చేసింది. Members Lost Life On Drinking Toxic Liquor పేరుతో వార్తలను కవర్ చేసింది వీ6. ఆ కథనాల్లో 45 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. వీరిలో 36 మంది చనిపోయారని.. మరికొంత మంది ఆరోగ్యం విషమంగా ఉందని ఈ కథనాల సారాంశం. ఇప్పుడు ఈ వీ6 కథనాల లింక్స్ ను కేటీఆర్ కు షేర్ చేస్తున్నారు నెటిజన్లు.

కేటీఆర్ సారూ.. వార్తలు చూస్తలేదాఏంటీ..? అయ్యో సారూ.. వార్తలు చూస్తలేరా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఎప్పుడూ మీ టీవీ, మీ పత్రికలే చూస్తే ప్రపంచం ఎలా తెలుస్తుందంటూ చురకలు అంటిస్తున్నారు.

కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుపట్టిన బీజేపీ

మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుపట్టారు.

మీడియాపై దౌర్జన్యామా..? టీడబ్ల్యూజేఎఫ్

రాజ్యాంగ పదవిలో ఉన్న మంత్రి కేటీఆర్.. మీడియాపై దౌర్జన్యం చేయటం సహించరాని నేరం అని.. బ్యాన్ చేస్తామని బెదిరింపులకు దిగటం సరికాదన్నారు టీడబ్ల్యూజేఎఫ్ జనరల్ సెక్రటరీ బసవ పున్నయ్య. కేటీఆర్ చేసిన కామెంట్స్ ను వెనక్కి తీసుకోవాలన్నారు. వేల మంది జర్నలిస్టులకు జీవితాన్ని ఇస్తున్న సంస్థలను బ్యాన్ చేస్తామని చెప్పటం రాజ్యాంగ విరుద్దమన్నారు. చట్టాలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేయాలని.. మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బసవ పున్నయ్య.