Devotional

ఏప్రిల్ 6న తుంబురుతీర్థ ముక్కోటికి విస్తృత ఏర్పాట్లు- టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

ఏప్రిల్ 6న తుంబురుతీర్థ ముక్కోటికి విస్తృత ఏర్పాట్లు- టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

తిరుమల, 25 మార్చి 2023: తిరుమల, 25 మార్చి 2023: తిరుమల శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థాల్లో ఒకటైన తుంబురు తీర్థముక్కోటికి ఏప్రిల్ 5, 6 తేదీల్లో విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం ఈవో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తుంబురు తీర్థానికి ఏప్రిల్ 5న ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, 6వ తేదీన ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు. పాప‌వినాశ‌నం డ్యామ్ వ‌ద్ద భక్తులకు అన్న‌ప్ర‌సాదాలు అందించాలని, అదేవిధంగా  ప్ర‌థ‌మ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని సూచించారు. భక్తులు భోజనం చేసేందుకు వీలుగా పాపానాశనం నుండి తాగునీటి కొళాయిలు, మార్గమధ్యంలో రోప్‌లు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా భక్తులకు ఇబ్బంది లేకుండా అవసరమైన సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కువ దూరం నడవాల్సింది వస్తుంది కావున గుండె సమస్యలు, స్థూలకాయం ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

భ‌క్తులు వంట సామగ్రి, క‌ర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకువెళ్ళ‌కుండా రేడియో అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు చేసేలా సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. పోలీసుశాఖ, అటవీశాఖ, టిటిడి విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుండి తుంబురు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని వుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు సేవలందించేందుకు శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలన్నారు.

ఈ సమీక్షలో ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఏఎస్పీ శ్రీ మునిరామయ్య, డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, విజివోలు శ్రీ బాలిరెడ్డి, శ్రీ గిరిధర్ రావు, డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాస్, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శ్రీ శాస్త్రి తదితర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది