Devotional

తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి..

తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి..

తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో ఏప్రిల్‌ 29వ తేదీ నుండి మూడు రోజుల పాటు జరుగనున్న శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలకు టిటిడి ఏర్పాట్లు పూర్తి చేసింది.

టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పరిణయోత్సవ మండపాన్ని టిటిడి కి చెందిన 30 మంది, తమిళనాడుకు చెందిన 50 మంది అలంకార నిపుణులు అలంకరిస్తున్నారని టిటిడి ఉద్యానవన సూపరింటెండెంట్‌ శ్రీనివాసులు తెలిపారు.

పూణేకు చెందిన దాత రూ.24 లక్షలతో వేదికను వైభవంగా ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు.

మూడురోజులపాటు జరుగనున్న ఈ వేడుకలో తొలిరోజు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనంపై, రెండవరోజు అశ్వవాహనంపై, చివరిరోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారు. మరోపక్కఉభయనాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తరువాత కల్యాణమహోత్సవం కన్నులపండుగగా నిర్వహిస్తారు.

#పౌరాణికప్రాశస్త్యం

పురాణాల ప్రకారం సుమారు ఐదు వేల ఏళ్ల కిందట, అంటే కలియుగం తొలినాళ్లలో సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీమహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు. ఆ సమయంలో నారాయణవనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీవేంకటేశ్వరునికిచ్చి వివాహం చేశారు. ఆకాశరాజు వైశాఖశుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫల్గుణి నక్షత్రంలో నారాయణవనంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీ వేంకటాచల మహాత్మ్యం గ్రంథం తెలుపుతోంది. ఆనాటి పద్మావతీ శ్రీనివాసుల కల్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమినాటికి ముందు ఒక రోజు, తరువాత ఒక రోజు కలిపి మొత్తం మూడురోజుల పాటు పద్మావతీ పరిణయోత్సవాన్ని టిటిడి నిర్వహిస్తోంది. 1992వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతోంది. ఆనాటి నారాయణవనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతీ పరిణయ వేడుకలు జరగడం విశేషం.