Politics

నేడు అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో జగన్ పర్యటన

నేడు అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో  జగన్ పర్యటన

గోదావరి వరద బాధితులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ముమ్మిడివరం, పి.గన్నవరం నియోజకవర్గాల పరిధిలోని వరద బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు. ప్రభుత్వ సాయం అందిన తీరుతో పాటు వారి ఇబ్బందులు స్వయంగా తెలుసుకుని, ధైర్యం చెప్పనున్నారు. గోదావరి నదీ కోతను పరిశీలించి, బాధితులతో మాట్లాడతారు. సీఎం పర్యటనకు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆధ్వర్యాన పక్కా ఏర్పాట్లు చేశారు. సీఎం రాక కోసం తొలిసారిగా లంక గ్రామమైన గురజాపులంకలో హెలిపాడ్‌ ఏర్పాటు చేయడం విశేషం.

వరద గోదావరి గత నెల 22న ఉగ్రరూపం దాల్చింది. ఆ తరువాత కాస్త నెమ్మదించినా.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యాక డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని సుమారు 30 లంక గ్రామాలకు వరద పోటెత్తింది. లంక గ్రామాలు 10 రోజులకు పైనే ముంపులో ఉన్నాయి. ఆ సమయంలో బాధితుల పరామర్శకు వస్తే ప్రభుత్వ సహాయ, పునరావాస కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావించారు. ముంపు బాధితులందరికీ ప్రభుత్వ సాయం అందించి, ఆదుకోవడమే ఏకైక అజెండాగా కలెక్టర్‌ సహా మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. గతంలో మాదిరిగా మాటలు ఒకటి, చేతలు మరొకటి కాకుండా బాధితులకు తక్షణ సాయం అందించేందుకు కోనసీమ జిల్లాకు యుద్ధప్రాతిపదికన రూ.3 కోట్లు పైగా అందించారు. కేవలం నిధులు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా.. గత పాలకులకు భిన్నంగా చివరి బాధితుల వరకూ సాయం అందించడమే ప్రధాన లక్ష్యంగా జిల్లా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. వలంటీర్ల నుంచి జిల్లా అధికారుల వరకూ ప్రతి ఒక్కరూ సీఎం ఆదేశాలను తు.చ. తప్పకుండా అమలు చేస్తూ.. వరద బాధితులకు అండగా నిలిచారు.

గతంలో వరదలు, ప్రకృతి విపత్తుల సమయంలో సాయం అందించినా.. అందించకున్నా సీఎం స్థాయిలోని వ్యక్తి ఆర్భాటపు పరామర్శలతో ప్రచారం చేసుకోవడం అందరికీ తెలిసిందే. ముందుగా ఎంపిక చేసుకున్న సానుభూతిపరులైన కొందరు బాధితులతో మాట కలిపి.. ఫొటోలకు పోజులిచ్చి వెళ్లిపోయే వారు. బాధితుల గోడు వినేవారు కాదు. సీఎం వెళ్లిపోయి రోజులు గడిచినా సాయం దరి చేరక కన్నీటితో ఎదురు చూసిన బాధితులు ఎంతో మంది ఉండేవారు. ఇటువంటి ప్రచారార్భాట పరామర్శలకు భిన్నంగా స్పందించిన తొలి ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధితుల హృదయాల్లో నిలిచిపోయారు. వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయం పూర్తిగా అందించిన తరువాతే ఆ ప్రాంతాల్లో పర్యటించాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ముంపు బాధితులను స్వయంగా పలకరించి, వారికి ప్రభుత్వ సాయం ఏ మేరకు అందిందో స్వయంగా తెలుసుకునేందుకు కోనసీమ జిల్లా లంకల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వ సాయంపై వారు సంతృప్తిగా ఉన్నారా లేక ఇంకా ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా అనే విషయాలు తెలుసుకోనున్నారు. సాయం అందని వారు ఎవరైనా ఉన్నారా, పంట నష్టం ఏ మేరకు జరిగిందో తెలుసుకుంటారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించే గ్రామాలను గుర్తించడం వరకే అధికారులు పరిమితమయ్యారు. తాను వెళ్లే మార్గంలో ఎదురుపడే బాధితులతో నేరుగా ఆయన మాట్లాడనున్నారు.

ముంపు తగ్గి, ట్రాక్టర్లు వెళ్లడానికి మార్గం సుగమం అయిన వెంటనే వరద బాధితులందరికీ 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, లీటర్‌ పామాయిల్‌, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళా దుంపల చొప్పున అందజేశారు. అర్ధరాత్రి వరకూ కూడా ఈ సాయం పంపిణీ చేయడం విశేషం. గత పాలకుల హయాంలో ఈవిధంగా సాయం అందించడానికి నాలుగైదు రోజుల నుంచి వారం రోజులు పట్టేది.

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక ప్రకటిస్తేనే కానీ గత ప్రభుత్వ హయాంలో బాధితులకు భోజనాలు, ఆహార పొట్లాలు అందించే వారు కాదు. ఈసారి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిలోనే వీటిని అందజేయడం విశేషం.

అలాగే, బాధితులు ఒక్కరే ఉంటే రూ.వెయ్యి, ఒకరికి మించి ఉంటే రూ.2 వేల చొప్పున వెంటనే ఆర్థిక సాయం కూడా పంపిణీ చేశారు. గతంలో ఎప్పుడూ ఈవిధంగా సాయం అందించలేదని బాధితులు ఆనందం వ్యక్తం చేశారు.

వరద బాధితులకు అందించిన సాయం

బాధిత కుటుంబాలు : 26,064

ఆహార పొట్లాలు : 86,013

వాటర్‌ ప్యాకెట్లు : 2,13,000

ఉచిత బియ్యం : 651.600 మెట్రిక్‌ టన్నులు
కందిపప్పు : 26,064 మెట్రిక్‌ టన్నులు
బంగాళా దుంపలు : 26.064 మెట్రిక్‌ టన్నులు
పామాయిల్‌ : 26,064 లీటర్లు
ఉల్లిపాయలు : 26,064 మెట్రిక్‌ టన్నులు
పాలు అర లీటర్‌ : 32,000

కొవ్వొత్తుల ప్యాకెట్లు : 1,00,000

సీఎం పర్యటన సాగనుందిలా..

ఉదయం 9.10: రాజమహేంద్రవరం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు.
9.40: ముమ్మిడివరం మండలం
గురజాపులంకకు రాక.
9.40 నుంచి 10.25: బాధితులతో మాటామంతి.
10.35 – 11.10: లంక ఆఫ్‌ ఠాణేలంక రామాలయంపేటలో బాధితులతో ముఖాముఖి.
11.20 – 11.50: అయినవిల్లి మండలం కొండుకుదురు తొత్తరమూడివారిపేట చేరిక. వరద బాధితులతో మాటామంతి.
11.50: గురజాపులంకకు పయనం.

మధ్యాహ్నం 12.15: హెలికాప్టర్‌లో తాడేపల్లికి పయనం.

ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంది. నా ఇల్లు వరదలో చిక్కుకుంది. అధికారులు వెంటనే స్పందించారు. నాకు రోజుకు రెండుసార్లు భోజనం పెట్టారు. మంచినీరు అందించారు. నిత్యావసర వస్తువులు, బి య్యం అందజేశారు. తాత్కాలిక అవసరాలకు రూ.2 వేల నగదు సాయం చేశారు. ముంపు నష్టాలు అంచనా వేసి న్యాయం చేస్తామని అధికారులు భరోసా ఇచ్చారు.