Editorials

వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల‌దాడి

వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల‌దాడి

వందే భారత్ ఎక్స్​ప్రెస్ రైళ్లపై తరచూ దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు పలుచోట్ల ఈ రైళ్లపై దాడులు జరగడంతో అవి ధ్వంసమయ్యాయి. తాజాగా ఇప్పుడు ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్​లో చోటుచేసుకుంది. యూపీలోని బారాబంకిలో వందేభారత్‌ రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో ఒక కోచ్‌ కిటికీలు పగిలిపోయాయి. గోరఖ్‌పుర్‌ నుంచి లక్నోకు ఆదివారం ఉదయం 6 గంటలకు వందే భారత్‌ రైలు బయల్దేరింది. యూపీలోని బారాబంకిలో సఫేదాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోకి రాగానే.. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో కోచ్‌ కిటికీలు పగిలాయి. ఎవరికీ గాయాలు కాలేదు.రైల్వే రక్షణ దళం ఈ ఘటనపై కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించింది. బారాబంకి రైల్వే పోలీసులు దీనిపై విచారణ చేపట్టి.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినందుకు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. జులై 7వ తేదీన గోరఖ్‌పుర్‌ – లఖ్‌నవూ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే.