Business

తిరుపతి :త్వరలోనే కొత్తగా 1500 ఎలక్ట్రిక్ బస్సులు

తిరుపతి :త్వరలోనే కొత్తగా 1500 ఎలక్ట్రిక్ బస్సులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) మరిన్ని విద్యుత్‌ బస్సులు (ఈ–­బస్సులు) కొనుగోలు దిశగా కార్యా­చరణకు సంసిద్ధమవుతోంది. కొత్తగా 1,500 ఈ–బస్సు­లను ప్రవేశ­పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే తిరు­మల–­­తిరుపతి ఘాట్‌ రోడ్డు సర్వీ­సుల కోసం 100 ఈ–­బస్‌­లను ఆర్టీసీ ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణా­లకూ వీటి సేవ­లను విస్తరించాలని నిర్ణయించింది. అందుకోసం రెండో దశ కింద 1,500 ఈ–బస్‌­లను ప్రవేశపెట్ట­నుంది. కేంద్ర ప్రభు­త్వానికి చెందిన కన్వర్జెన్స్‌ ఎనర్జీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (సీఈఎస్‌­ఎల్‌)తో కలిసి ఆర్టీసీ ఈ బస్సులను తీసుకురానుంది.

డీజిల్‌ బస్సుల స్థానంలో ఈ–బస్‌లు..
సీఈఎస్‌ఎల్, ఆర్టీసీ సంయుక్తంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఒక్కో బస్సుకు రూ.కోటి చొప్పున రూ.1,500 కోట్ల బడ్జెట్‌తో ప్రాజెక్టును ఆమోదించాయి. డీజిల్‌ బస్సుల స్థానంలో ఈ–­బస్‌­లను ప్రవేశపెట్టడం ద్వారా పర్యావరణ పరి­రక్షణతో­పాటు 27 శాతం నిర్వహణ వ్యయం తగ్గు­తుంది. ఇక తొమ్మిది మీటర్ల పొడవుండే ఈ–బస్‌లు అయితే కి.మీ.కు రూ.39.21, అదే 12 మీటర్ల పొడవున్న ఈ–బస్‌ అయితే కి.మీ.కు రూ.43.49 వ్యయం అవుతుందని అంచనా వేశారు.

జిల్లా కేంద్రాల మధ్య ఈ–బస్‌ సర్వీసులు
రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలతోపాటు ప్రధాన పట్ట­ణాల్లో ఈ–బస్‌ సేవలను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. అందుకే సమీపంలో ఉన్న జిల్లా కేంద్రాల మధ్య ఈ సర్వీసులను నిర్వహించాలని నిర్ణయించారు. మొదటగా విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు డిపోలకు వాటిని కేటాయించనున్నారు.

ఆ డిపో కేంద్రాలు ఉన్న జిల్లా కేంద్రాల నుంచి రానూపోనూ 250 కి.మీ. దూరంలో ఉన్న జిల్లా కేంద్రాలతోపాటు ప్రధాన పట్టణాలకు వీటిని నడుపుతారు. ఎందుకంటే ఈ–బస్‌లకు ఓసారి చార్జింగ్‌ పెడితే గరిష్టంగా 250 కి.మీ. వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. అందుకోసం ఆయా డిపోల్లో చార్జింగ్‌ స్టేషన్లను కూడా ఏర్పాటుచేస్తారు. ఇక ఆర్టీసీకి వెయ్యి ఈ–బస్‌లను అద్దె విధానంలో అందించేందుకు సీఈఎస్‌ఎల్‌ త్వరలో టెండర్ల ప్రక్రియ నిర్వహించనుంది. అనంతరం ఈ ఏడాది చివరి నాటికి వాటిని ఆర్టీసీకి అందజేస్తుంది.