NRI-NRT

జో బైడెన్‌పై అభిశంసన

జో బైడెన్‌పై అభిశంసన

యూఎస్‌ హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ రిపబ్లికన్‌ స్పీకర్‌ కెవిన్‌ మెక్‌కార్తి పార్టీ ఒత్తిడికి తలొగ్గారు. అధ్యక్షుడు జో బైడెన్‌పై (Joe Biden) అభిశంసన విచారణకు అనుమతి మంజూరు చేశారు. ‘అధికారిక అభిశంసన విచారణను ప్రారంభించాలని నేను మా హౌస్‌ కమిటీని ఆదేశిస్తున్నానని’ ఆయన పేర్కొన్నారు. డెమోక్రటిక్‌ పార్టీ నుంచి అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ తన కుమారుడు హంటర్‌ విదేశీ వ్యాపార లావీదేవీలను దాచిపెట్టాడని ఈ సందర్భంగా ఆరోపించారు. ఈ విచారణ ప్రకటనను వైట్‌హౌస్‌ విమర్శించింది. ప్రతిపక్షం ‘అత్యంత దారుణమైన రాజకీయాలు’ చేస్తోందని మండిపడింది. ‘హౌస్‌ ఆఫ్‌ రిపబ్లికన్లు తొమ్మిది నెలలుగా అధ్యక్షుడిని విచారిస్తున్నారు. అయినా వారు తప్పు జరిగినట్లు ఆధారాలు చూపలేకపోయారని’ వైట్‌హౌస్‌ ప్రతినిధి ఇయన్‌ సామ్స్‌ ట్వీట్ చేశారు. డెమోక్రాట్‌ పార్టీకి చెందిన ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ కుమారుడు హంటర్‌ ఉక్రెయిన్‌కు చెందిన ఇంధన కంపెనీ బురిస్మాలో గతంలో డైరెక్టర్‌గా ఉన్నారు. బురిస్మా సంస్థ నుంచి జో, హంటర్‌ బైడెన్‌లకు ముడుపులు ముట్టాయని ప్రతిపక్ష రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు) దిగువ సభలో ప్రతిపక్ష రిపబ్లికన్లకు మెజారిటీ ఉండటాన్ని అవకాశంగా తీసుకుని బైడెన్‌ను అభిశంసించాలని ట్రంప్‌ డిమాండు చేస్తున్నారు. గతంలో ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డెమోక్రాట్లు రెండుసార్లు ఆయనపై అభిశంసన తీర్మానాలు ప్రవేశపెట్టారు. అప్పట్లో దిగువ సభలో వారిదే మెజారిటీ. అమెరికా చరిత్రలో ట్రంప్‌లా రెండుసార్లు అభిశంసన తీర్మానానికి గురైన అధ్యక్షుడు మరొకరు లేరు. ఇప్పుడు దానికి ప్రతీకారంగా బైడెన్‌ను అభిశంసించాలని ట్రంప్‌ పట్టుబడుతున్నారు.