Devotional

తిరుమలలో ఘనంగా తిరుమంజనం

తిరుమలలో ఘనంగా తిరుమంజనం

తిరుమల వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందుగా వచ్చే మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా కోయిల్ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రక్తంగా నిర్వహించినట్లు చైర్మన్ వివరించారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు. కార్యక్రమం సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు.

శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేకపూజలు చేసి, నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతించారు.