Politics

60 ఏళ్ల పాటు మునుగోడు ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది!

60 ఏళ్ల పాటు మునుగోడు ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది!

కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే తెలంగాణ అంధకారమేనని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 60 ఏళ్ల పాటు మునుగోడు ప్రజలను ఇబ్బందికి గురి చేసింది ఎవరని ప్రశ్నించారు. గతంలో 11 ఛాన్స్‌లు ఇచ్చినప్పుడు కాంగ్రెస్‌ నేతలు ఏం చేశారు?అని కేటీఆర్‌ నిలదీశారు.

అది మునుగోడు ప్రజలకు తెలుసు
గతంలో కాంగ్రెస్‌లో గెలిచిన అభ్యర్థి భాజపాలోకి వెళ్లారని.. ఆయన అక్కడికి ఎందుకు వెళ్లారో మునుగోడు ప్రజలకు తెలుసని చెప్పారు. 55 ఏళ్లు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా రైతుబంధు ఎందుకివ్వలేదని దుయ్యబట్టారు. 3 గంటల కరెంట్‌ చాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ చెబుతున్నారని.. వ్యవసాయానికి 3 గంటల కరెంట్‌ సరిపోతుందో? లేదో?ప్రజలే చెప్పాలన్నారు. కరెంట్‌ కావాలో? కాంగ్రెస్‌ కావాలో? తేల్చుకోవాలన్నారు. మరోసారి భారాస అధికారంలోకి వస్తే పింఛన్‌ను రూ.5 వేలకు పెంచుతామన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.3 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. అసైన్డ్‌ భూములు ఉన్న వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పారు.

జాబ్‌ క్యాలెండర్‌పై దృష్టి సారిస్తాం
భాజపా సిద్ధాంతాలను రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లో అమలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ప్రధాని మోదీని రేవంత్‌ ఒక్కసారి కూడా విమర్శించలేదన్నారు. కాంగ్రెస్‌ హవా అనేది సామాజిక మాధ్యమాల్లో ప్రచారం మాత్రమేనని ఎద్దేవా చేశారు. 80 సీట్లలో మళ్లీ భారాస అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తొమ్మిదిన్నరేళ్లలో మైనార్టీలకు చాలా చేశామని.. వారి మద్దతు తమకే ఉందని చెప్పారు. ఎన్నికల ఫలితాలు రాగానే జాబ్‌ క్యాలెండర్‌పై దృష్టి సారిస్తామన్నారు. అలాగే రైతు బంధు చెల్లింపులకు అనుమతివ్వాలని ఈసీని 2 సార్లు కోరామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పీఎం కిసాన్‌కు లేని అడ్డంకి రైతుబంధుకు ఎందుకు?అని ప్రశ్నించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z