Politics

10 ఏళ్ల భారాస పాలనను విధ్వంసం అంటే!

10 ఏళ్ల భారాస పాలనను విధ్వంసం అంటే!

అసెంబ్లీలో సభ్యుల సంఖ్య ముఖ్యం కాదని, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆకాంక్షించారు. కేసీఆర్‌కు పదవులిచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ అని చెప్పారు. ఈ మేరకు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో వాడీవే‘ఢీ’గా చర్చ జరిగింది. శనివారం శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే.. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ పేరును సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ ప్రకటించారు. అనంతరం గవర్నర్‌ ప్రసంగం ధన్యవాద తీర్మానాన్ని శాసనసభలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ప్రతిపాదించగా.. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ వెంకటస్వామి బలపరిచారు.

తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన చరిత్ర భారాసదే
ఆ తర్వాత భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ.. గవర్నర్‌ ప్రసంగమంతా తప్పుల తడకగా, సత్యదూరంగా ఉందని ఆరోపించారు. ఆయన మాట్లాడుతుండగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌ అడ్డు తగిలారు. 2014కు ముందు అన్యాయం జరిగిందనే తెలంగాణ కోసం కొట్లాడామని చెప్పారు. మొదలు పెట్టడమే కేటీఆర్‌ దాడి చేస్తున్నట్లు మాట్లాడడం సరికాదన్నారు. నిర్మాణాత్మక సూచనలు ఇస్తే తీసుకుంటామని తెలిపారు. ‘‘రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన చరిత్ర భారాసదే. ఆర్‌డబ్ల్యూఎస్‌ ద్వారా కట్టిన వ్యవస్థలు, సంస్థలను ధ్వంసం చేశారు. తెలంగాణను రూ.5లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారు’’ అని భట్టి అన్నారు.

50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనను ఏమనాలి?
దీంతో తెలంగాణ రాకముందు బీడువారిన భూములు ఉండేవని, 10 ఏళ్ల భారాస పాలనను విధ్వంసం అంటే.. 50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనను ఏమనాలి?అని కేటీఆర్‌ ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వానికి 3 నెలల సమయం ఇద్దామని కేసీఆర్‌ చెప్పారన్నారు. భారాస అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజల పక్షమేనన్నారు. గత కాంగ్రెస్‌ పాలనలో ఆత్మహత్యలు, ఆకలి కేకలు ఉన్నాయని.. పదవుల కోసం పెదవులు మూసిన చరిత్ర కాంగ్రెస్‌ది అని చెప్పారు.

మేం చెప్పే ప్రయత్నం చేసినా వారు తెలుసుకోరు: సీఎం
కేటీఆర్‌ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. ‘‘కొంతమంది ఎన్‌ఆర్‌ఐలకు ప్రజాస్వామిక స్ఫూర్తి అంటే అర్థం తెలియట్లేదు. మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకోరు. సభ్యుల సంఖ్య ముఖ్యం కాదు.. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలి. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై పోరాడింది కాంగ్రెస్‌ నేతలే. కేసీఆర్‌కు వివిధ పదవులు ఇచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ. ఎమ్మెల్యే కాకుండానే హరీశ్‌ రావుకు మంత్రి పదవి ఇచ్చిందే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి’’ అని చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z