Editorials

ఏపీలో 21మంది IASల బదిలీ-తాజావార్తలు

ఏపీలో 21మంది IASల బదిలీ-తాజావార్తలు

* రాష్ట్రంలో 21 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. నియామకాల వివరాలివే..

శ్రీకాకుళం జిల్లా – మంజీర్‌ జిలానీ
తిరుపతి జిల్లా – లక్ష్మీ షా
నంద్యాల జిల్లా – కె.శ్రీనివాసులు
అన్నమయ్య జిల్లా – అభిశక్త్‌ కిషోర్‌
పార్వతీపురం మన్యం – బి.ఆర్‌.అంబేడ్కర్‌ ( జాయింట్‌ కలెక్టర్‌)
విపత్తు నిర్వహణ డైరెక్టర్‌ – ఆర్‌. కుమార్‌ నాథ్‌
జీవీఎంసీ అదనపు కమిషనర్‌ – విశ్వనాథన్‌
హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ – రమణారెడ్డి
పురపాలకశాఖ కమిషనర్‌- బాలాజీరావు
శ్రీకాకుళం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ – తమీమ్‌ అన్సారియా
పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌- ఇల్లకియా
కాకినాడ జాయింట్‌ కలెక్టర్‌ – ప్రవీణ్ ఆదిత్య
సర్వే సెటిల్‌మెంట్‌ అదనపు డైరెక్టర్‌ – గోవిందరావు
ప్రకాశం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ – రోణంకి గోపాలకృష్ణ
విశాఖపట్నం – మయూర్‌ అశోక్‌
విజయనగరం – కె. కార్తిక్‌
అల్లూరి సీతారామరాజు – భావన
నెల్లూరు – ఆదర్శ్‌ రాజీందరన్‌
తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌ – అదితీ సింగ్‌
ప్రభుత్వ రంగ సంస్థల విభాగ కార్యదర్శి – రేఖా రాణి
ఏపీయూఎఫ్‌ఐడీసీ ఎండీ – డి. హరిత

* రాజకీయంగా గల్లా జయదేవ్‌ను మిస్‌ అవుతామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. రాజకీయాలకు గుంటూరు ఎంపీ జయదేవ్‌ తాత్కాలికంగా విరామం ప్రకటించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞతాభివందనం సభలో లోకేశ్‌ మాట్లాడారు. అమరావతి రైతుల తరఫున పోరాటం చేసిన వ్యక్తి జయదేవ్‌ అని కొనియాడారు. ఆయన కోసం తెదేపా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు.

* తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని (Telangana CM Revanth Reddy) టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాతలు (Tollywood Producers) మర్యాద పూర్వకంగా కలిశారు. సీఎం నివాసంలో సమావేశమై కాసేపు ముచ్చటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు దిల్‌ రాజు, తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు కె. ఎల్‌. దామోదర ప్రసాద్‌, కౌన్సిల్‌ సెక్రటరీ ప్రసన్న కుమార్‌, తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు సునీల్‌ నారంగ్‌, ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ప్రెసిడెంట్‌ పీవీ రవి కిశోర్‌, ట్రెజరర్‌ బాపినీడు, సుప్రియ తదితరులు ఉన్నారు.

* రిటైర్డ్ ఆర్టీసీ అధికారులు, సిబ్బంది సంక్షేమానికి టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం కట్టుబడి ఉందని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. దీనికోసం ప్రభుత్వ సహకారంతో కృషి చేస్తామని అన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ బాగుకోసం రిటైర్డ్ ఉద్యోగులు అకుంఠిత దీక్షతో నిబద్దత, క్రమ శిక్షణతో చేసిన సేవలు గొప్పవని ఆయన కొనియాడారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో స్టేట్ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్స్ రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆదివారం నిర్వహించిన ఐదో వార్షిక సమావేశానికి సజ్జనార్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 75 ఏండ్లు నిండిన 41 మంది విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగులను ఆయన ఘనంగా సన్మానించారు. అనంతరం సజ్జనార్‌ మాట్లాడుతూ.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సలహాలు, సూచనలతో సంస్థలో ఎన్నో వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టామని తెలిపారు. ఆర్టీసీ రెగ్యులర్‌ అధికారులు, సిబ్బందితో పాటు రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. టీఎస్‌ఆర్టీసీ తార్నాక ఆస్పత్రిని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. తార్నాక ఆస్పత్రిలో గుండె సంబంధిత సర్జరీలు తప్ప.. అన్ని వైద్య సేవలను అందిస్తున్నామని వివరించారు.

* ఓటమి భయంతోనే ఇండియా కూటమిని బలహీనపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఇండియా కూటమిలో ఇన్నాళ్లు కీలక పాత్ర పోషించిన బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ కక్కిన కూడు తినేందుకే తిరిగి ఎన్డీయే కూటమిలోకి వెళ్లారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లోని ముఖ్దూం భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడారు. ఫిబ్రవరి 2, 3, 4వ తేదీల్లో సీపీఐ జాతీయ సమితి సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

* సీఎం రేవంత్‌ రెడ్డిని రాజేంద్రనగర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన ఆయన.. దాదాపు అరగంట పాటు రేవంత్‌ రెడ్డితో సమావేశమయ్యారు. దీంతో ప్రకాశ్‌ గౌడ్‌ పార్టీ మారబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రకాశ్‌ గౌడ్‌.. తాను కాంగ్రెస్‌లో చేరినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

* ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత‌గా ఇట‌లీ యువ సంచ‌ల‌నం జ‌నిక్ సిన‌ర్ నిలిచాడు. మెల్‌బోర్న్‌లోని రాడ్‌ లీవర్‌ ఎరీనా వేదిక‌గా ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచులో ర‌ష్యాకు చెందిన డానియల్ మెద్వెదేవ్ ను ఓడించారు. 3-6, 3-6, 6-4, 6-4, 6-3 తేడాతో గెలుపొందిన సిన‌ర్ తొలిసారి ఆస్ట్రేలియ‌న్ విజేత‌గా నిలిచాడు. 1959,1960లో వరుసగా రోలాండ్ గారోస్ టైటిల్‌లను గెలుచుకున్న నికోలా పిట్రాంజెలీ, 1976 రోలాండ్ గారోస్‌లో టైటిల్‌ను గెలుచుకున్న అడ్రియానో ​​పనట్టా తర్వాత గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న మూడవ ఇటాలియన్ ఆట‌గాడిగా సిన‌ర్ రికార్డుల‌కు ఎక్కాడు.

* ములుగు జిల్లా మేడారానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం(జనవరి 28) సెలవు దినం కావడంతో ముందస్తు మొక్కుల చెల్లింపులు కొనసాగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 2 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉందని తెలిపారు ఆలయ అధికారులు. రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు భక్తులు. దీంతో సమ్మక్క, సాలమ్మ ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి. అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్ లో బారులు తీరారు భక్తులు. వన దేవతలకు బెల్లం, వస్త్రాలు, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు.

* చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. తనపై చంద్రబాబు మితిమీరి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నన్ను పాపాల పెద్దిరెడ్డి అంటావా ?. నీ లాగా మామకు వెన్నుపోటు పొడిచానా ?. ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడితు ప్రజలే రాళ్లతో కొడతారన్నారు. చంద్రబాబు నువ్వు అధికారంలోకి రావు. కనీసం కుప్పంలో కూడా గెలవలేవు. కుప్పంకు మేము నీరు ఇస్తున్నాం… 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఏమి చేశావ్. ఓటమి భయంతో చంద్రబాబు మాటలు మాట్లాడుతున్నారు.” అని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

* తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో లోపాలు ఉన్న మాట వాస్తవమన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. దళిత బంధు పథకం ఒక పద్దతిగా ఇస్తే బాగుండేదన్నారు. దళితబందు వల్లే..గిరిజన బంధు, బీసీ బంధు ఇవ్వాలన్న డిమాండ్ ఎక్కువ కావడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడిందన్నారు . మూడేళ్ల కింద ఇండ్ల పంపిణీ చేస్తే బాగుండేదీ…ఎన్నికల ముందు పంపిణీ చేయటం ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేసాం….ప్రజలు ఆదరించక పోవడం భాదకరమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట ద్వారా తాగు నీరుఅందించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ దేనని చెప్పారు. పాలకుర్తిలో ప్రజలతో మమేకం కాకపోవడం వల్లే బీఆర్ఎస్ ఓటమికి కారణమన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ప్రభుత్వంలో ఉండి ఎనో పనులు చేశాం.. అందరికీ పదవులిచ్చామన్నారు. మానవ సంబంధాలు లేక పోవడం వల్లే ఎర్రబెల్లి ఓడిపోయారన్నారు. తనపై ప్రత్యర్థి ఎన్ని డబ్బులు పంపిణీ చేసినా ప్రజలు తననే గెలిపించారన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z