వీసాల కోసం ఎదురు చూస్తున్న భారతీయులకు శుభవార్త. వీసాల జారీ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. దరఖాస్తుదారు వీసా కోసం ఎదురుచూసే సమయం (వెయిటింగ్ పీరియడ్) తగ్గబోతుంది. ప్రస్తుతమున్న వెయిటింగ్ పీరియడ్ను 2023 వేసవి నాటికి మరింత తగ్గిస్తామని అమెరికా దౌత్య కార్యాలయానికి చెందిన ఓ సీనియర్ అధికారి గురువారం వెల్లడించారు. కరోనా అనంతరం భారత్ నుంచి వీసా దరఖాస్తులు అధికమయ్యాయి. దీంతో హెచ్1బీ, ఎల్తోపాటు బీ1, బీ2(బిజినెస్, టూరిస్ట్) వీసాలకు సంబంధించి 450 రోజులుగా ఉన్న వెయిటింగ్ పీరియడ్ను ఇటీవల తొమ్మిది నెలలకు తగ్గించారు. ఈ సమయాన్ని మరింత తగ్గించాలని నిర్ణయించారు. భారతీయులకు వీసాల ఇచ్చేందుకు ప్రాధాన్యమిస్తున్నామని, ఇందులో భాగంగా ఏడాదికి 12 లక్షల వీసాలు ముంజూరు చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నామని ఆ అధికారి తెలిపారు. వచ్చే వేసవి కల్లా కరోనా మునుపటి పరిస్థితులను తీసుకురావడమే తమ లక్ష్యమని వివరించారు. హెచ్1బీ, ఎల్ కేటగిరీ వీసాల రెన్యువల్ కోసం చూస్తున్న వారి కోసం ఇటీవల లక్ష స్లాట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు.