Politics

ప్రచార వేదికపైనే ఏడ్చేసిన జయప్రద

jayaprada cries in 2019 campaign

ప్రముఖ నటి, భాజపా నేత జయప్రద కన్నీరు పెట్టుకున్నారు.ఆమె ఇటీవల భాజపాలో చేరిన విషయం తెలిసిందే. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రామ్‌పూర్‌ నియోజవర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా రామ్‌పూర్‌లో నిర్వహించిన ప్రచార సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘నా పుట్టిన రోజు కానుకగా భాజపా నాకు రామ్‌పూర్‌ టికెట్‌ను బహుమతిగా ఇచ్చింది. దీని ద్వారా నాకు మరోసారి ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది.కానీ సమాజ్‌వాదీ పార్టీ నేత అజాం ఖాన్‌ నామీద ఎన్నో ఆరోపణలు చేశారు. నన్ను రామ్‌పూర్‌ నుంచి వెళ్లిపోవాలంటూ డిమాండ్‌ చేశారు. లేకపోతే యాసిడ్‌ దాడులు చేస్తామని బెదిరించారు’ అంటూ బోరున విలపించారు. వెంటనే అక్కడున్న భాజపా కార్యకర్తలందరూ వేదిక వద్దకు వచ్చి ఆమెను ఓదార్చారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు జయప్రదకు మద్దతుగా ఉంటామంటూ ప్రతిజ్ఞ చేశారు. కొంత సేపటి తర్వాత మళ్లీ ఆమె మాట్లాడుతూ..‘తొలిసారి నా వెనక భాజపా బలం ఉంది. ఇంతకు ముందులా ఇంకెప్పుడూ నేను ఏడవను. నాకు బతికేహక్కుంది. బతుకుతాను కూడా. ఎవ్వరు నన్నేమీ చేయలేరు. భాజపాలో చేరతానంటే నన్ను కొందరు హెచ్చరించారు. కానీ ప్రజాసేవకు ఈ పార్టీయే నాకు మంచిదనిపించింది.నేను గెలవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. మరోసారి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇమ్మని దేవుడిని కోరుకుంటున్నాను. దీంతోపాటు మీ ఆశీర్వాదం కూడా కావాలి’ అని ముగించారు.