ScienceAndTech

మీ ఆయుధాలు మకొద్దు! రష్యావి బాగానే పనిచేస్తున్నాయి!

india america russia arms deal air force satellite and radar weapons

ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ కొనుగోలుదార్లలో భారత్‌ కూడా ఒకటి. ఇప్పటి వరకు మనకు అత్యధికంగా ఆయుధాలు విక్రయిస్తున్న దేశం రష్యా. మన ఆయుధాగారంలో రష్యా ఆయుధాలు సగానికి పైగా ఉంటాయంటే ఆశ్చర్యం లేదు. ఇటీవలే భారత గగనతలాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చేందుకు రష్యాకు చెందిన ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ ఎస్‌-400ను కొనుగోలుకు డీల్‌పై సంతకం చేసింది. గత కొన్నేళ్లుగా అమెరికా కూడా భారత్‌కు ఆయుధాలను విక్రయిస్తోంది. పొసైడాన్‌ విమానాలు, అపాచీ, షినుక్‌ హెలికాప్టర్లు అలా కొనుగోలు చేసినవే. ఇప్పుడు భారత మార్కెట్‌ను కైవసం చేసుకొనేందుకు రష్యా, అమెరికా మధ్య పోటీ ఉందంటే ఆశ్చరం లేదు. ఈ క్రమంలో రష్యాతో ఎస్‌-400 డీల్‌ను ఆపేందుకు శాయశక్తులా కృషి చేసింది. కానీ, సాధ్యం కాలేదు. ఒకానొక దశలో అమెరికాకు చెందిన అత్యున్న క్షిపణి రక్షణ వ్యవస్థ థాడ్‌, పేట్రియాట్‌ ప్యాక్‌-3ను ఆఫర్‌ చేసింది. కాకపోతే అమెరికా థాడ్‌ ధర చాలా ఎక్కువగా ఉంది. సీఎన్‌బీసీ లెక్క ప్రకారం ప్రతి యూనిట్‌ ధర 3 బిలియన్‌ డాలర్లు. ఒక్కో యూనిట్‌లో ఆరు లాంఛర్లు ఉంటాయి. సౌదీ అరేబియా ఇలాంటివి 15 బిలియన్‌ డాలర్లు పెట్టి 44 లాంఛర్లను కొనుగోలు చేసింది. మరోపక్క భారత్‌ 5.4 బిలియన్‌ డాలర్లకే ఐదు ఎస్‌-400 వ్యవస్థలను కొనుగోలు చేసింది. ఒక్కో వ్యవస్థలో ఎనిమిది లాంఛర్లు ఉంటాయి. భారత్‌కు ఎంత ధరకు ఆఫర్‌ చేసిందో అన్న విషయం మాత్రం బయటకు రాలేదు. అప్పటికే కాట్సా చట్టం అమల్లోకి రావడంతో భారత్‌పై ఆంక్షలు విధించే అవకాశం అమెరికాకు లభించింది. ఈ క్రమంలో భారత్‌-అమెరికా మధ్య 2+2 మీటింగ్‌ జరిగింది. దీనిలో కూడా భారత్‌ తనకు ఎస్‌-400 అవసరాన్ని అమెరికాకు నొక్కి చెప్పింది. భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా భారత్‌ను ఇబ్బంది పెట్టేందుకు అమెరికా ఇష్టపడలేదు. దీంతో కాట్సా మినహాయింపుల పై సానుకూలంగా స్పందించింది. కాకపోతే అధ్యక్షుడు ట్రంప్‌ అంగీకారం దీనికి తప్పని సరి. నాటి డిఫెన్స్‌ సెక్రటరీ జేమ్స్‌ మ్యాటిస్‌ కూడా భారత్‌, వియత్నాంలకు మినహాయింపులు ఇవ్వాలని కోరారు.