Business

బంగారంపై కరోనా పంజా

బంగారంపై కరోనా పంజా

ధరలు మండిపోతుండటంతో, పసిడి, వెండి కొనుగోలుకు శుభప్రదంగా భావించే ధన త్రయోదశి (శుక్రవారం) ఈసారి ఎలా ఉంటుందోనని విక్రేతలు ఎదురు చూస్తున్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ సమర్థతపై ఫైజర్‌ ప్రకటన నేపథ్యంలో, సోమవారం అంతర్జాతీయ, దేశీయ ఫ్యూచర్‌ విపణుల ధరల్లో భారీగా దిద్దుబాటు చోటుచేసుకోవడమూ ప్రభావం చూపుతోంది. కొనుగోలుదార్లను ఆకర్షించి, అమ్మకాలు పెంచుకునేందుకు తరుగు, మజూరు ఛార్జీలలో రాయితీ, పాత ఆభరణాల మార్పిడికి ప్రోత్సాహకాలను సంస్థలు ఆఫర్‌ చేస్తున్నాయి. బంగారం ధర బాగా పెరిగినందున, తక్కువ బరువులోనే, ఆకర్షణీయ రూపుల్లో ఆభరణాలను చేయించడంపై సంస్థలన్నీ దృష్టి సారించాయి. దీపావళి, ధన త్రయోదశి సందర్భంగా సొంత అవసరాలతో పాటు బహుమతులుగా ఇచ్చేందుకు జరిపే కొనుగోళ్లు అధికంగా ఉంటాయి. వ్యక్తులతో పాటు కార్పొరేట్‌ సంస్థలూ ఇందులో ముందుంటాయి. ఉన్నతోద్యోగులకు బంగారం, వెండి నాణేలు గతంలో ఎక్కువగ ఇచ్చేవారు. ఉత్తర భారతీయుల కంపెనీలు, వాణిజ్య సంస్థల్లో దీపావళికి బోనస్‌లు ఇస్తుంటారు కనుక, ఆ మొత్తంతో భార్యాపిల్లల కోసం పసిడి కొనుగోలు చేయడమూ ఎక్కువే. కాకపోతే కొవిడ్‌-19 నేపథ్యంలో, ఇటీవలి వరకు పలు సంస్థలు వేతన కోతలు అమలు చేశాయి. బోనస్‌లు మాత్రం 2019-20కి సంబంధించిన ఆర్థిక అంశాలకు సంబంధించనది కావడం, ఈ నవంబరులోపు పంపిణీ చేయాల్సి ఉన్నందున, లాభాల్లో ఉన్న సంస్థలు జారీ చేస్తున్నాయి. అయితే మేలిమి బంగారం ధర గతేడాదితో పోలిస్తే గ్రాముకు రూ.1350 పెరిగి రూ.5250కి చేరింది. వెండి ధర కూడా కిలో రూ.64000పైన ఉంది. గతేడాది దీపావళి సమయానికి మేలిమిబంగారం గ్రాము ధర రూ.3900 మాత్రమే కావడం గమనార్హం. గతేడాది ఈ పండుగకు కొనుగోలు చేసిన వారి ఆభరణాల విలువ పెరగడంతో, వారు సంతోషిస్తుంటారు. ఈసారీ కొనుగోలు చేస్తే మరింత లాభపడతాం అనే భావనలోనూ ఉంటారు. అయితే ధర మరీ ఎక్కువగా ఉండటం, ఆర్థిక మందగమన ప్రభావం ఉండొచ్చని విక్రేతలు భావిస్తున్నారు. అందుకే పాత బంగారం మార్పిడితో అయినా కొత్తవి కొనుగోలు చేసేలా ఆఫర్లతో ఆకర్షిస్తున్నారు. ఆర్థిక మందగమన ప్రభావం అంతగా లేని సంపన్నులు మాత్రం ఖరీదైన ఆభరణాలు కొనుగోలు చేస్తారనే ఆశిస్తున్నారు.