Business

అమెజాన్ సరుకుల దుకాణాలు దూసుకొస్తున్నాయి

Amazon pantry spreads to another 70 cities in India

ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.ఇన్‌ భారత్‌లో వేగంగా విస్తరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా ప్యాంట్రీ సర్వీసులను 110 పట్టణాలకు విస్తరించేందుకు పనులు చేపట్టింది. గత ఏడాది నవంబర్‌ నాటికి దేశంలోని 40 పట్టణాలకు మాత్రమే ఈ సర్వీసు అందుబాటులో ఉంది. ‘‘అమెజాన్‌.ఇన్‌లో నిత్యావసర వస్తువుల మార్కెట్‌ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ విభాగంలో అమెజాన్‌ ప్యాంట్రీ పేరుతో వినియోగదారులకు దగ్గరయ్యాము. గత ఆరేడు నెలలుగా మరో 70 పట్టణాలను మా ప్యాంట్రీ జాబితాలో చేరుస్తున్నాము. దీనిని 110కి చేర్చాలన్నది మా లక్ష్యం. ’’ అమెజాన్‌ ఇండియా కేటగిరీ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ సౌరభ్‌ శ్రీవాస్తవ వెల్లడించారు. కర్ణాటకలోని బెల్గాం, హరియాణాలోని కథల్‌ వంటి చిన్న పట్టణాలు కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించాయి. అమెజాన్‌ ప్యాంట్రీలో 500 బ్రాండ్లకు చెందిన 5,000 ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే బెంగళూరు, దిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, పుణే, వినియోగదారులు ప్యాంట్రిని వినియోగిస్తున్నారు. దీనిలో వినియోగదారులే డెలీవరికి సంబంధించిన స్లాట్‌ను బుక్‌చేసుకోవచ్చు. దీంతోపాటు అమెజాన్‌ గ్రోసరీ విభాగంలో 500 మిలియన్‌ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. భారత్‌లో ఈ విభాగంలో ఎదిగేందుకు చాలా అవకాశం ఉందని అమెజాన్‌ ఆశిస్తోంది.