DailyDose

ప్రశంసల్లో తడిసి ముద్దవుతున్న నవీన్ పట్నాయక్-రాజకీయ-05/10

Orissa CM Naveen Patnaik Praised For His Cyclone Handling Administration

*ఒడిశా సీఎం నవీన్‌కు ప్రపంచ వ్యాప్త ప్రశంసలు
ఫొని’ తుపాను నేపథ్యంలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సమర్థమైన పాత్ర పోషించినందుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌కు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలందుతున్నాయి.ఐక్యరాజ్య సమితి సీఎంను అభినందిస్తూ లేఖ రాసింది. వాషింగ్టన్‌ పోస్ట్‌ తదితర అంతర్జాతీయ ప్రచార సాధనాలు, ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ప్రధాని దేవెగౌడ, కాశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబాముఫ్తీ తదితరులు నవీన్‌ను అభినందించిన వారిలో ఉన్నారు. తుపాను సందర్భంగా 12గంటల వ్యవధిలో 12లక్షల మందిని సహాయ కేంద్రాలకు తరలించిన ప్రభుత్వం ప్రాణనష్టాన్ని తగ్గించగలిగిందని ప్రశంసించారు.
*తెరాసలోకి రమ్మని కేసీఆర్‌ బంధువులు కలిశారు: జగ్గారెడ్డి
తెరాసలోకి రావాలని తనను ముఖ్యమంత్రి కేసీఆర్‌ బంధువులు వచ్చి కలిశారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఈ నెల 25 నుంచి 30వ తేదీలోగా తాను గాంధీభవన్‌లో ఉంటానో, తెరాస భవన్‌లో ఉంటానో కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడారు. కేంద్రంలో యూపీఏ సర్కారు వస్తేనే తెలంగాణలో కాంగ్రెస్‌కు మనుగడ ఉంటుందని అభిప్రాయపడ్డారు. స్వశక్తితో ఎదిగానని, పార్టీ బ్యానర్‌పై గెలిచిన నాయకుడిని కాదని చెప్పారు.
*రెండో విడతలోనూ తెరాసదే ఆధిక్యం: కేటీఆర్‌
తెలంగాణవ్యాప్తంగా శుక్రవారం జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ రెండో విడత ఎన్నికల్లో తెరాసకే భారీ ఆధిక్యం లభిస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు.రెండో విడత ఎన్నికలను పురస్కరించుకొని కేటీఆర్‌ రామేశ్వరం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో ఫోన్‌లో గురువారం మాట్లాడారు. ‘‘మొదటి విడత మాదిరిగానే రెండో విడతలోనూ తెరాసకే అన్ని అనుకూలతలు ఉన్నాయి. ఎన్నికల రోజున పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంతో పనిచేయాలి.
*త్వరలో కోవర్టుల పేర్లు వెల్లడిస్తా: వీహెచ్‌
కాంగ్రెస్‌లో కోవర్టులున్నారని, త్వరలో వారి పేర్లు బయటపెడతానని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు చెప్పారు. గాంధీభవన్‌లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌కు చేరవేస్తున్నారని ఆరోపించారు. వారిని దూరం చేయకపోతే పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. గాంధీభవన్‌లో వీహెచ్‌ మాట్లాడుతూ..పార్టీలో కోవర్టులున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమని చెప్పారు. పార్టీకి విధేయులుగా ఉన్న నాయకులపై వివక్ష చూపుతున్నారని, కొత్తగా వచ్చినవారికి ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రాలో జగన్‌ సీఎంగా ఉండాలి, తెలంగాణలో సీఎంగా కేసీఆర్‌ ఉండాలనే విధానంతో కొందరు పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ ప్రభుత్వంపై టీపీసీసీ నాయకులు ఉత్తుత్తి పోరాటం చేస్తున్నారని విమర్శించారు.
*21న సమావేశం ఉండకపోవచ్చు
ఎన్డీయేతర పక్షాల సమావేశం ఈనెల 21న జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. గురువారం కోల్‌కతాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీలు సమావేశమైనప్పుడు సమావేశం తేదీపై స్పష్టత రాలేదని తెలిసింది. ఈవీఎంలు నిల్వ చేసిన స్ట్రాంగ్‌రూమ్‌ల భద్రతపై అనేక అనుమానాలున్నాయని, అధికారపక్షం భాజపా దేనికైనా తెగించే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ వాటి భద్రతపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మమతాబెనర్జీ అభిప్రాయపడినట్లు సమాచారం.
*అది కేసీఆర్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన సభ
కొందరు నేతలు అంబేడ్కర్‌ గర్జన పేరిట హైదరాబాద్‌లో కేసీఆర్‌ వ్యతిరేక సభ నిర్వహించారని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ పిడమర్తి రవి ధ్వజమెత్తారు. ఈ సభలో అంబేడ్కర్‌ వాదులెవరూ పాల్గొనలేదని, మంద కృష్ణను చూసి జాతీయ నాయకులెవరూ రాలేదని అన్నారు. మంద కృష్ణ వసూళ్ల దందాపై సీబీసీఐడీ విచారణ కోసం త్వరలోనే గవర్నర్‌ను కలుస్తామని ఆయన చెప్పారు. గురువారం తెలంగాణ భవన్‌లో తెరాస ఆస్ట్రేలియా విభాగం సహ కన్వీనర్‌ కందుల విక్రం తదితరులతో కలిసి పిడమర్తి రవి విలేకరులతో మాట్లాడారు.
*స్థానిక’ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా వేయండి
స్థానిక సంస్థల కోటాలో వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి నియోజకవర్గాలకు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఓటర్ల జాబితా లేకుండానే ఎన్నికల షెడ్యూల్‌ ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం సీఈసీ సునీల్‌ అరోడాకు లేఖ రాశారు. కొత్తగా ఎన్నికయ్యే సభ్యులతో ఎన్నికలకు వెళ్లాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయని, 27 నాటికి కొత్త ఓటర్లు అందుబాటులోకి వస్తారని తెలిపారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, తన లేఖను అత్యవసరంగా పరిగణించాలని కోరారు.
*దీదీ.. మీ చేతిదెబ్బ మాకు ఆశీర్వాదమే
ఎన్నికల్లో ఓటమి భయంతోనే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. ప్రధాన మంత్రిగా మోదీని అంగీకరించటానికి తాను సిద్ధంగాలేనని ఆమె బహిరంగంగా చెప్పటం దేశ రాజ్యాంగాన్ని అగౌరవపరచటమేనని తెలిపారు. గురువారం ఆయన పశ్చిమబెంగాల్‌లోని బంకురా, పురులియాలలో నిర్వహించిన ఎన్నికల సభల్లో ప్రసంగించారు. ఫొని తుపాను సందర్భంగా రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకోవటానికి మమతకు తాను ఫోన్‌ చేస్తే మాట్లాడటానికి నిరాకరించిన విషయాన్ని ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కనీసం రాష్ట్ర అధికారులతోనూ చర్చించనివ్వలేదని ఆరోపించారు. మోదీని గడువు ముగిసిన ప్రధానిగా మమత అభివర్ణించిన విషయం తెలిసిందే.