Editorials

ఆంధ్రాలో ఆపరేషన్ భాజపా ఆరంభం –TNI ప్రత్యేకం

Operation BJP In Andhra Pradesh-TNILIVE Editorial Specials

కేంద్రంలో పూర్తీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన భాజపా తాను ఘోర పరాజయం పాలైన ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టింది. ఆంధ్రాలో ఆపరేషన్ ఆకర్ష పేరుతొ భాజపా భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొన్న జరిగిన ఎన్నికల్లో భాజపా తెలంగాణాలో పుంజుకున్నప్పటికి ఆంధ్రాలో ఘోరంగా పరాజయం పాలైంది. దీంతో ఆంధ్రాలో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాన్ని పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ డియోదర్ కు అప్పగించారు.
*మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తిరిగి కోలుకునేలోపే భాజపా తనపనిని చక్కబెట్టుకోవడానికి సన్నాహాలు చేస్తుంది.
**గుంటూరు నుండి మొదలు ..
గుంటూరు జిల్లాలో ఒక సీనియర్ తెదేపా మాజీ ఎంపీ, ఒక మాజీ మంత్రి వారి అనుచరులను పెద్ద ఎత్తున భాజపాలో చేరటానికి త్వరలో సిద్దమైనట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఒక ఎంపీ భాజపాలోకి వెళ్తారనే ప్రచారం గత కొద్దిరోజుల నుండి జోరుగా సాగుతుంది. తెదేపా బలంగా ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆపార్టీ నేతలను భాజపాలోకి తరలించడానికి కన్నా లక్ష్మీనారాయణ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. భాజపా బలంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లోనూ కాంగ్రెస్ తెదేపా నేతలకు ఆపార్టీ గాలం వేస్తుంది. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రాలో తుడిచి పెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతోనూ భాజపా నాయకులు బేరాలు మొదలు పెట్టినట్లు సమాచారం.
**భాజపా జాతీయ అద్యక్షుడిగా రాంమాధవ్..
ప్రసుతం భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తెలుగువారైన రాంమాధవ్ ను అమిత్ షా స్థానంలో ఆపార్టీ జాతీయ అద్యక్షుడిగా నియమిస్తారని డిల్లి నుండి సంకేతాలు వెలువడుతున్నాయి. రాంమాధవ్ ను అద్యక్షుడిగా నియమిస్తే ఆంధ్రాతో పాటు దక్షినాది రాష్ట్రాల్లోని భాజపా పటిష్టవంతం చేయటానికి అవకాశాలు ఉంటాయని ఆపార్టీ జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆంధ్రా రాష్ట్రానికి చెందిన చాలా మంది తెలుగుదేశం నాయకులు డిల్లి బాట పట్టినట్లు సమాచారం. త్వరలో భారీగా తెదేపా కాంగ్రెస్ నాయకులను ఒకేసారి పెద్ద ఎత్తున పార్టీలోకి చేర్చుకునే కార్యక్రమాన్ని ఆంధ్రాలో ఏర్పాటు చేయటానికి భాజపా నేతలు సన్నహాలు చేసుకుంటున్నారు. – కిలారు ముద్దుకృష్ణ సీనియర్ జర్నలిస్ట్.