Business

ముకేశ్ అంబానీ జీతం ₹15కోట్లు మాత్రమే

Mukesh Ambani Restricts His Salary To 15Crores

అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ వరుసగా పదకొండో ఏడాది తన వార్షిక వేతనాన్ని రూ. 15కోట్లకు పరిమితం చేసుకున్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ హోదాలో 2008-09 నుంచి ముకేశ్‌ ఇంతే జీతం తీసుకుంటున్నారు. దాదాపు ఏటా రూ. 24కోట్లను తృణప్రాయంగా వదులుకుంటున్నారు. కంపెనీలో శాశ్వత డైరెక్టర్లందరి జీతాలు పెరుగుతున్నా ముకేశ్‌ మాత్రం తన వేతనాన్ని పెంచుకునేందుకు ఇష్టపడట్లేదు.
‘ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముకేశ్‌ అంబానీ కోరిక మేరకు ఈ ఏడాది కూడా ఆయన వేతనాన్ని రూ. 15కోట్లుగా నిర్ణయించాం. యాజమాన్య వేతన స్థాయిలు తక్కువగా ఉండాలని చెప్పడానికి ముకేశ్‌ వ్యక్తిగత ఉదాహరణగా నిలిచారు’ అని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన వార్షిక నివేదికలో పేర్కొంది. 2018-19లోనూ ముకేశ్ ఇంతే మొత్తం జీతంగా తీసుకున్నారు.
* 2018-19లో ముకేశ్‌ రూ. 4.45కోట్లు జీతంగా అందుకున్నారు. ఇక కమిషన్ కింద రూ. 9.53కోట్లు, ఇతర భత్యాలు రూ. 31లక్షలు, పదవీ విరమణ ప్రయోజనాల కింద రూ. 71లక్షలు తీసుకున్నారు.
* సీఈఓల వేతన పరిమాణాలపై చర్చ నేపథ్యంలో అక్టోబరు 2009న అంబానీ తన వేతనాన్ని స్వచ్ఛందంగా రూ.15 కోట్లకు పరిమితం చేసుకున్నారు. ఇతర ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల వేతనాలు పెరిగినప్పటికీ.. ఈయన మాత్రం ఆ మొత్తానికే కట్టుబడి ఉన్నారు.
* అంబానీ బంధువులైన నిఖిల్‌ ఆర్‌ మేస్వానీ, హితాల్‌ ఆర్‌ మేస్వానీ కూడా కంపెనీలో శాశ్వత డైరెక్టర్లుగా ఉన్నారు. వీరి వేతనాలు రూ. 20.57కోట్లకు పెరిగాయి. ఎగ్జిక్యూటివ్‌ పీఎంఎస్‌ ప్రసాద్‌ వేతనం రూ. 8.99కోట్ల నుంచి రూ. 10.01కోట్లకు పెరిగింది.
* నీతా అంబానీ సహా కంపెనీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లకు రూ. 1.65కోట్ల కమిషన్‌ లభించింది. సిట్టింగ్‌ ఫీజుకు ఇది అదనం. అంతక్రితం ఏడాది ఈ కమిషన్‌ రూ. 1.5కోట్లుగా ఉంది. సిట్టింగ్‌ ఫీజు కింద నీతా అంబానీ రూ. 7లక్షలు అందుకున్నారు. గతేడాది రిలయన్స్‌ బోర్డులో చేరిన ఎస్‌బీఐ మాజీ ఛైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాఛార్య రూ. 75లక్షల కమిషన్‌ తీసుకున్నారు.