Movies

నాకు భయం బాగా పెరిగింది

Nayanthara Says Her Fears Have Increased

వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం తనకు ఇష్టం ఉండదని అన్నారు ప్రముఖ అగ్రకథానాయిక నయనతార. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ చాలా బిజీగా గడుపుతున్నారు ఈ నటి. తాజాగా ఆమె ‘వోగ్‌ ఇండియా’ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా తన జీవితం గురించి విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ‘నేను షూటింగ్స్‌తో బిజీగా ఉంటాను. నాకు పనిపట్ల అంకితభావం ఎక్కువ. ఇతర విషయాలను అంతగా పట్టించుకోను. సినిమాల్లో విజయం సాధించి అగ్రకథానాయికను అయినంత మాత్రాన వేరేవాళ్లలాగా నాకు గర్వం రాలేదు. నిజం చెప్పాలంటే నాకు భయం పెరిగింది. ఏ పాత్రలో నేను సరిగ్గా నటించలేనో అనే భయంతో జీవిస్తున్నాను.’ అని నయనతార తెలిపారు. 2017లో విడుదలైన ‘కర్తవ్యం’, 2018లో విడుదలైన ‘కోకో కోకిల’ వంటి కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాల్లో కూడా నయనతార నటించిన విషయం తెలిసిందే. ఇటువంటి సినిమాల గురించి నయనతార మాట్లాడుతూ.. ‘కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాల్లో ప్రతి విషయాన్ని నేనే చూసుకుంటాను.’ అని అన్నారు. నయనతార వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో వదంతులు వచ్చాయి. వదంతులపై ఆమె త్వరగా స్పందించని విషయం కూడా తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో ఆమె వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడుతూ.. ‘ఈ 10 సంవత్సరాల్లో ఇది నా మొదటి ఇంటర్వ్యూ. నేను ఏం ఆలోచిస్తున్నానో ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం నాకు ఇష్టం ఉండదు. సినిమాల్లో నటించడం మాత్రమే నా పని. మిగిలిన విషయాలను నేను పట్టించుకోను.’ అని నయనతార పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నయనతార నటించారు. ‘సిద్ధమ్మ’గా ఆమె ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మరోవైపు ఆమె రజనీకాంత్‌తో ‘దర్బార్‌’ చిత్రంలో నటిస్తున్నారు. అంతేకాకుండా విజయ్‌ ‘బిగిల్‌’ చిత్రంలో కూడా ఆమె నటించారు.