Politics

చంద్రబాబుపై కేసులో ఆసక్తి చూపని లక్ష్మీపార్వతి

Lakshmi Parvati Not Interested In Case Against Chandrababu

చంద్రబాబుకు ఆదాయానికి మించి ఆస్తులున్నాయని.. ఏసీబీతో విచారణ చేయించాలని.. లక్ష్మిపార్వతి.. పదిహేనేళ్ల కిందట పిటిషన్ వేసింది. ఇప్పుడు.. ఆ కేసు విచారణకు ఆమె ముందుకు రావడం లేదు. అమె స్వయంగా కోర్టుకు హాజరై.. సాక్ష్యాన్ని ఇవ్వాల్సి ఉంది. కానీ.. కోర్టు ముందుకు వచ్చేందుకు ఆమె సిద్ధంగా లేరు. ఇప్పటికే.. రెండు, మూడు వాయిదాలు పడిన ఆ కేసు.. లక్ష్మిపార్వతి రాని కారణంగా మరో సారి వాయిదా పడింది. ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసిన నందమూరి లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయాల్సి ఉండగా.. ఆమె తన తరఫున సీనియర్‌ న్యాయవాది హాజరవుతారని, అప్పటి వరకూ కేసు విచారణను వాయిదా వేయాలని ఆమె తరపు న్యాయవాది కోర్టును కోరారు. దాంతో కేసు విచారణ ఈ నెల 20కి వాయిదా పడింది. చంద్రబాబుపై.. లక్ష్మిపార్వతి 2005లో ఈ పిటిషన్ వేశారు. అప్పట్లో ఈ కేసు విషయంలో హైకోర్ట్ విచారణ నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. ప్రస్తుతం ఆ స్టే పై ఎటువంటి పొడిగింపు లేకపోవడంతో విచారణ ప్రారంభించాలని ఏసీబీ కోర్టు జడ్జి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. చాలా కాలం అయినందున.. కేసు విచారణను కొనసాగంచాలా.. పిటిషన్ ఉపసంహరించుకుంటారా.. అని ఓ సందర్భంలో కోర్టు లక్ష్మిపార్వతిని ప్రశ్నించింది. దానికీ కూడా ఆమె.. స్పష్టమైన సమాచారాన్ని.. కోర్టుకు ఇవ్వలేదు. ఆ తర్వాత లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయాలని సూచిస్తూ కేసును గతనెల 25 వ తేదీకి వాయిదా వేశారు. అప్పుడు కూడా.. లక్ష్మిపార్వతి ముందుకు రాలేదు. ఇప్పుడు కూడా.. అదే పరిస్థితి. అసలు పిటిషన్ వేసిన లక్ష్మిపార్వతి ఇప్పుడు కూడా కోర్టు ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. తన తరపున సీనియర్ లాయర్‌ను పంపుతాననే.. చెబుతున్నారు కానీ.. తాను హాజరవుతానని చెప్పడం లేదు.