NRI-NRT

అమెరికాలో OPT విద్యార్థుల కష్టాలు

OPT Students Under All Time Stress In USA

అమెరికా వెళ్లి ఉన్నత విద్య పూర్తి చేసి, ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) అర్హతతో ఉద్యోగం చేస్తున్న దాదాపు 68 వేల మంది భారతీయ సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగులు ఇప్పుడు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. మూడేళ్ల కాలవ్యవధి కోసం ఇచ్చే ఓపీటీ ఈ ఏడాదితో పూర్తి కానుండటమే దీనికి కారణం. ఇప్పటికే రెండుసార్లు హెచ్‌1బీ వీసా అవకాశం కోల్పోయిన ఈ సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్లకు ఈ ఏప్రిల్‌ చివరి అవకాశం. అప్పటికీ వీసా రాకపోతే స్వదేశానికి తిరిగి వెళ్లడం లేదా మళ్లీ విశ్వవిద్యాలయంలో చేరి పీహెచ్‌డీలో చేరడం (అన్ని అర్హతలు ఉంటే)లేదా ఎంఎస్‌లో మరో కోర్సు చేయడమే ప్రత్యామ్నాయం. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిలో అత్యధికులు తిరిగి ఎంఎస్‌లో చేరడానికి సుముఖంగా లేరు. ఒకవేళ వీసా రాకపోతే భారత్‌ తిరిగి వెళ్లడం తప్ప మరో మార్గం లేదు. 2015–16లో అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన వారు ఇప్పుడు వీసా సమస్యలు ఎదుర్కొంటున్నారు. 2014 నుంచి ఉన్నత విద్య కోసం వెళుతున్న వారి సంఖ్య రెట్టింపు కావడమే దీనికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కంప్యూటర్‌ రంగంలో పని చేసేవారికి అమెరికా ఏటా 85 వేల మందికి హెచ్‌1బీ వీసాలు మంజూరు చేస్తోంది. కానీ, భారత్‌ నుంచి ఉన్నత విద్యకు వెళ్లి ఆపైన హెచ్‌1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య 2016లోనే లక్ష దాటింది. ఈ ఏడాది భారతీయుల సంఖ్య 1.5 లక్షలు దాటుతుందని న్యూయార్క్‌కు చెందిన హెచ్‌1బీ వ్యవహారాల నిపుణుడు అటార్నీ నీల్‌ ఏ వెయిన్‌రిచ్‌ అంచనా వేస్తున్నారు. వచ్చే రెండేళ్లలో హెచ్‌1బీ వీసా కోసం దరఖాస్తు చేసే భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల సంఖ్య 2 లక్షలు దాటినా ఆశ్చర్యం లేదని, వారిలో 65 నుంచి 70 వేల మందికి మాత్రమే వీసాలు దక్కుతాయని చెబుతున్నారు.
*హెచ్‌1బీ ఉన్న వారి కోసం వేట..
వీసా సమస్య నుంచి బయటపడేందుకు భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు హెచ్‌1బీ వీసా కలిగి ఉన్న వారిని జీవిత భాగస్వాములను చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికాలో హెచ్‌1బీ వీసా ఉన్న వారి సంబంధాలు చూడాలని భారత్‌లో తమ తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు. హెచ్‌1బీ వీసా కలిగి ఉండి (గ్రీన్‌కార్డు కోసం వెయిటింగ్‌లో ఉంటే) జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసుకునే వీలు ఉంటుంది. గ్రీన్‌కార్డు కోసం వెయిటిం గ్‌లో లేని హెచ్‌1బీ వీసా అబ్బాయి లేదా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అమెరికాలో చట్ట బద్ధంగా ఉండేందుకు అవకాశముంది. ఇప్పుడు భారత్‌లో మ్యారేజ్‌ బ్యూరోలు దీన్నో లాభసాటి వ్యాపారంగా మలుచుకున్నాయి.
*తెలుగు రాష్ట్రాల నుంచి 24 వేల మంది!
ఓపీటీ గడువు దాటుతున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు 20 నుంచి 24 వేల మంది ఇంజనీర్లు ఉంటారని అంచనా. నిర్ణీత గడువులో వీసా రాకపోతే స్వదేశానికి వెళ్లి మళ్లీ హెచ్‌1బీ దరఖాస్తు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బంది లేని భారతీయ టెకీలు అక్కడే ఉండేం దుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నారు. ‘డబుల్‌ డిగ్రీ ఓ ప్రయాస. మా విశ్వవిద్యాలయంలో డబుల్‌ కోర్సు చేసిన అనేక మంది విద్యార్థులు చివరికి వారికి తగిన ఉద్యోగాలు రాక కెనడా, అస్ట్రేలియా, బ్రిటన్‌ వంటి దేశాలకు వెళ్లారు. ఉద్యోగం కోసమే అమెరిక వస్తే సమస్యలు తప్పవు’అని యూనివర్సిటీ అఫ్‌ కాలిఫోర్నియా (బర్క్‌లీ) కంప్యూటర్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌ ఎరిక్‌ అలెన్‌ బ్రూవర్‌ ఇటీవల న్యూయార్క్‌ టైమ్స్‌కు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ఉన్నత విద్య కోసం వస్తున్న వారు ఉపాధి అవకాశాలను లక్ష్యం చేసుకుని వస్తున్నారా లేదా విజ్ఞానం పెంపొందించుకోవడానికి వస్తున్నారా అనే దానిపై భారత్‌ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఇటీవల ముంబైలో యూనివర్సిటీ అఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియ ప్రొఫెసర్‌ బారీ విలియమ్స్‌ అన్నారు.