Movies

పశ్చాత్తాపం లేదు

Rashi Khanna Speaks Of Regrets-Telugu Latest Movie News

‘‘ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా నేను నటించిన ప్రతి సినిమాకీ నేను అండగా నిలబడతాను’’ అని కథానాయిక రాశీ ఖన్నా తెలిపారు. ఇప్పుడు షూటింగులేవీ జరగడం లేదు. సినిమాలేవీ విడుదల కావడం లేదు. ఈ సమయంలో రాశీ ఖన్నా ఇటువంటి స్టేట్మెంట్‌ ఇవ్వడం వెనుక ఓ కారణం ఉంది. ఫిబ్రవరిలో విడుదలైన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’లో ఆమె బోల్డ్‌గా నటించారు. అప్పట్లో ఆ పాత్ర గురించి గొప్పగా చెప్పారు. అయితే… ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భవిష్యత్తులో పాత్రల విషయంలో హద్దులు దాటకూడదని ఆమె చెప్పినట్టు వెబ్‌లో వార్తలొచ్చాయి. ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’లో యామినీ పాత్ర చేసినందుకు బాధ పడుతున్నట్టు కొందరు కథలు అల్లేశారు. మీమ్స్‌, ట్రోల్స్‌ వచ్చాయి. ఈ నేపథ్యంలో రాశీ ఖన్నా వివరణ ఇచ్చారు. ‘‘ఓ సినిమా విజయం సాధించవచ్చు. సాధించకపోవచ్చు. కానీ, ప్రతి సినిమా ఓ అందమైన ప్రయాణం. ప్రతి సినిమాలో మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం. మన సామర్థ్యం మేరకు నటులుగా ఎదుగుతాం. నేను చేసిన ప్రతి సినిమాకీ నేను అండగా నిలబడతా’’ అని రాశీ ఖన్నా అన్నారు.