Politics

భారతరత్న ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

భారతరత్న ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఇక లేరు. దిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్‌, రెఫరల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు అభిజిత్‌ ముఖర్జీ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అనారోగ్యంతో ఈ నెల 10న ఆస్పత్రిలో చేరిన 84 ఏళ్ల ప్రణబ్‌ ముఖర్జీకి మెదడులో రక్తం గడ్డ కట్టినట్టు గుర్తించిన వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఆయనకు కరోనా పాజిటివ్‌గా కూడా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రణబ్‌ ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించడంతో సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ‘ప్రణబ్‌ దా’గా సన్నిహితులు ఆత్మీయంగా పిలుచుకొనే 84 ఏళ్ల ప్రణబ్‌ ముఖర్జీ భారత రాజకీయాల్లో అత్యంత కీలక నేతల్లో ఒకరు. యాభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ఉన్నత పదవులు నిర్వహించిన ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. కాంగ్రెస్‌లో వివాద పరిష్కర్తగా పేరు పొందారు. పశ్చిమ బెంగాల్‌లోని మిరాటిలో 1935 డిసెంబర్‌ 11న ప్రణబ్‌ జన్మించారు. ఆయన తండ్రి కె.కె.ముఖర్జీ స్వాతంత్య్ర ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు. పశ్చిమ బెంగాల్‌ శాసన మండలిలో కాంగ్రెస్‌ తరఫున ప్రాతినిధ్యం వహించారు. గ్రాడ్యుయేషన్‌ తర్వాత ప్రణబ్‌ పొలిటికల్‌ సైన్స్‌, చరిత్రలో మాస్టర్స్‌ పట్టాలను పొందారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టాను సాధించారు. సువ్రా ముఖర్జీని వివాహమాడారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రణబ్‌ ముఖర్జీ సతీమణి సువ్రా ముఖర్జీ 2015 ఆగస్టులో కన్నుమూశారు. 2019లో భారతరత్నతో కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. 2008లో పద్మవిభూషణ్‌ పురస్కారం అందుకున్నారు. 1997లో ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు అందుకున్నారు.