Health

ఇండియాలో కరోనా మరణాలకు ఎవరు కారణం-TNI బులెటిన్

ఇండియాలో కరోనా మరణాలకు ఎవరు కారణం-TNI బులెటిన్

* భారతదేశంలో కోవిడ్ మరణాలు 1,00,000 దాటాయి.. ఈ మరణాలకు కారణాలేమిటి?భారతదేశంలో నిర్ధరిత కోవిడ్ మరణాల సంఖ్య ఒక లక్ష దాటింది. ఈ విషాదాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత ఇండియా మూడో స్థానంలో నిలిచింది.రికార్డుల ప్రకారం సెప్టెంబర్ నెల భారతదేశంలో అత్యంత దారుణంగా ఉంది: రోజుకు సగటున 1,100 మంది ఈ వైరస్ వల్ల చనిపోయారు. ఇందులో ప్రాంతాల వారీగా హెచ్చుతగ్గులున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాల కన్నా అధికంగా మరణాలు నమోదయ్యాయి.ఈ మహమ్మారి ఇంకా దేశంలో విస్తరించటం కొనసాగుతోందనటానికి ఇది సంకేతమని నిపుణులు అంటున్నారు.దేశంలో కోవిడ్-19 ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న ప్రాంతాలేవి? ఎందుకు? అనే అంశాలపై కొన్ని విశ్లేషణలివీ…అగ్రస్థానంలో మహారాష్ట్రభారతదేశంలో అతి పెద్ద, అత్యంత ధనిక రాష్ట్రాల్లో ఒకటైన మహారాష్ట్ర.. కేసుల సంఖ్యలోనూ – 13 లక్షలు పైనే, మరణాల సంఖ్యలోనూ – 36,000 అగ్రస్థానంలో ఉంది.మహారాష్ట్ర మీద మహమ్మారి చాలా ముందుగా పంజా విసిరింది. తెరిపినివ్వకుండా వేగంగా వ్యాపించింది. సెప్టెంబరులో రోజుకు 300 నుంచి 500 మంది చొప్పున మరణాలు నమోదయ్యాయి. తీవ్రంగా ప్రభావితమైన ఇతర రాష్ట్రాల్లో ఇదే నెలలో రోజుకు సుమారు 100 మరణాల చొప్పున నమోదయ్యాయి.ఇప్పుడు కరోనా మహమ్మారి పరిశీలకులను ఆందోళనకు గురి చేస్తోంది జనసమ్మర్థం గల ఆర్థిక రాజధాని ముంబై నగరం కాదు. ఇప్పటికీ అత్యధిక మరణాలు నమోదైన జిల్లా ముంబై నగరమే అయినా.. పుణె నగరం 5,800 మరణాలతో రెండో స్థానంలోకి దూసుకొచ్చింది.ప్రస్తుతం కోవిడ్ మరణాలు అత్యధికంగా ఉన్న 10 జిల్లాల్లో ఐదు జిల్లాలు – ముంబై, పుణె సహా – మహారాష్ట్రలోనే ఉన్నాయి.”మహారాష్ట్రలో ఈ మహమ్మారి ప్రవేశద్వారం ముంబై నగరం” అంటారు డాక్టర్ అర్ణబ్ ఘోష్. పుణె నగర వాసుల్లో ర్యాండమ్ యాంటీబాడీ శాంపిల్ సర్వే నిర్వహించిన బృందంలో ఆయన ఒకరు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో జనాభాలో సగం మందిలో కోవిడ్ యాంటీబాడీలు ఉన్నాయని ఆ ప్రభుత్వ సర్వే గుర్తించింది.ముంబై ఎక్కువగా స్వీయ నియంత్రణ సాధించగా.. పుణె జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య; పుణె, పరిసర జిల్లాల మధ్య రాకపోకలు అధికంగా ఉండటం వల్ల ఈ ప్రాంతాల్లో వైరస్ మరింతగా విస్తరించిందని డాక్టర్ ఘోష్ చెప్పారు.మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో వైద్య వ్యవస్థలు కూడా తట్టుకోలేకపోయాయి.. ఫలితంగా మరణాల సంఖ్య పెరిగింది. పుణెలోని ‘జంబో’ కోవిడ్ సెంటర్‌లో ఇటీవల నిర్లక్ష్యం వల్ల ఒకరు చనిపోయారన్న ఆరోపణలతో పతాక శీర్షికలకెక్కింది.విషమిస్తున్న పంజాబ్ పరిస్థితిపంజాబ్‌లో కరోనా కేసుల్లో మరణాల రేటు (కేస్ ఫాటాలిటీ రేట్) మూడు శాతంగా ఉంది. ఇది భారతదేశ జాతీయ సగటు కేస్ ఫాటాలిటీ రేటు కన్నా రెట్టింపు.నంబర్ల రీత్యా చూస్తే మరణాల సంఖ్యలో దేశంలో పంజాబ్ తొమ్మిదో స్థానంలో ఉంది. కానీ.. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కేస్ ఫాటాలిటీ రేటు 4 శాతం కన్నా ఎక్కువగా నమోదవుతోంది.”పంజాబ్ పరిస్థితి ఆందోళనకలిగిస్తోంది. రాష్ట్రంలో కేస్ ఫాటాలిటీ రేటు దేశంలోనే అత్యధికంగా ఉండటమే కాదు.. ఇంకా పెరుగుతోంది కూడా” అని డాక్టర్ షమికా రవి చెప్పారు. బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్ ఫెలోగా ఉన్న ఆమె కరోనా మహమ్మారి వ్యాప్తిని పరిశీలిస్తున్న వారిలో ఒకరు.”ఇది ఆందోళకరం. ఎందుకంటే ప్రపంచమంతటా, భారతదేశ వ్యాప్తంగా కూడా విస్తృతంగా పరీక్షలు నిర్వహించటం, చికిత్స గురించిన అవగాహన పెరుగుతుండటం వల్ల కేస్ ఫాటాలిటీ రేటు తగ్గుతోంటే.. ఇక్కడ దానికి విరుద్ధంగా జరుగుతోంది” అని ఆమె పేర్కొన్నారు.మహారాష్ట్ర, పంజాబ్ రెండు రాష్ట్రాల్లోనూ.. టెస్టులు పరిమితంగా ఉండటం వల్ల కేసుల సంఖ్య అధికంగా పెరుగుతున్నాయని ఆమె భావిస్తున్నారు. పరీక్షలు తక్కువగా ఉండటం వల్ల మరణాల రేట్లు పెరగవచ్చునని.. ఎందుకంటే పరిస్థితి చేయిదాటి పోయిన తర్వాతే అధికారులకు ఈ ఇన్‌ఫెక్షన్ గురించి తెలుస్తుందని విశ్లేషించారు.టెస్టులు తక్కువగా ఉండటమే సమస్యా?పంజాబ్‌లో కరోనా పాజిటివ్ రేటు 6.2 శాతంగా ఉంది. అదే మహారాష్ట్రలో అయితే 24 శాతంగా ఉంది. అలా చూస్తే పంజాబ్ కేస్ పాజిటివ్ రేటు తక్కువే. కానీ.. పంజాబ్‌కు సమాన సంఖ్యలో టెస్టులు – పది లక్షల మందికి 60,000 – చేస్తున్న బిహార్ (2.5 శాతం), జార్ఖండ్ (3.7 శాతం)ల కన్నా ఎక్కువ. అయినా ఈ రెండు రాష్ట్రాల పాజిటివ్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి.”పరీక్షలు తక్కువగా ఉండి.. పాజిటివ్ రేటు ఎక్కువగా ఉన్నట్లయితే.. ఇన్‌ఫెక్షన్ చాలా ముందుకు పాకిందని అర్థం. కేసులను చాలా లేటుగా పట్టుకుంటున్నారన్న మాట” అని డాక్టర్ షమిక వివరించారు.మహారాష్ట్ర పరిస్థితి తన వాదనను బలపరుస్తోందని ఆమె చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో అధిక సంఖ్యలో పాజిటివిటీ రేట్లు, అధిక సంఖ్యలో మరణాలు నమోదవటం స్థిరంగా కొనసాగుతోంది. అయినా కానీ టెస్టుల సంఖ్యను గణనీయంగా పెంచలేదు.అయితే.. ఈ రెండిటి మధ్య సంబంధం ఉందనే వాదనతో అందరూ ఏకీభవించటం లేదు. ”నేరుగా ఏదైనా సంబంధం ఉందనేది నాకైతే తెలియదు. తగినన్ని పరీక్షలు నిర్వహించటం లేదంటే.. చాలా కేసులను పట్టుకోవటం లేదని అర్థం. కానీ అలా మిస్సయిన కేసుల్లో ఎంత భాగం మరణాలకు కారణమవుతోందనేది చెప్పటం కష్టం” అంటారు అంటువ్యాధుల నమూనాల అంశంలో ప్రొఫెసర్, పరిశోధకుడు డాక్టర్ గౌతమ్ మీనన్.ఈ సంబంధం మరో రకంగా ఉండి ఉండొచ్చునని డాక్టర్ ఘోష్ చెప్తున్నారు. టెస్ట్ చేయించుకోవటం గురించి అవగాహన తక్కువగా ఉండటం, టెస్టు చేయించుకోలేకపోవటం వల్ల టెస్టుల సంఖ్య కూడా తక్కువగా ఉండవచ్చునని.. అది తర్వాతి దశల్లో ఆస్పత్రుల్లో చేరటానికి కారణం కావచ్చునని, దీనివల్ల మరణం అవకాశాలు పెరగవచ్చుననేది విశ్లేషణ.

* ఏపీ ప్రభుత్వం కరోనా బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఒక్కరోజు వ్యవధిలో 72,811 నమూనాలను పరీక్షించగా 6,242 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,19,256కి చేరింది. 24 గంటల వ్యవధిలో 40 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందారు. కృష్ణా జిల్లాలో 6 మంది, అనంతపురంలో 5, చిత్తూరు 5, తూర్పుగోదావరి 4, గుంటూరు 4, నెల్లూరు 4, ప్రకాశం 3, విశాఖపట్నం 3, శ్రీకాకుళం 2, పశ్చిమగోదావరి 2, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 5,981కి చేరింది. ఒక్కరోజులో 7,084 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 60,94,206 నమూనాలను పరీక్షించినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు.

* కరోనా వైరస్‌కు టీకాలు సిద్ధమైన వెంటనే దేశవ్యాప్తంగా అందరికీ సమానంగా పంపిణీ చేయడం కోసం ప్రభుత్వం విశ్రాంతి లేకుండా పనిచేస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్‌ తెలిపారు. దేశంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ సరఫరా చేయడమే తమ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్విటర్‌ వేదికగా నిర్వహించిన సండే సంవాద్‌లో పేర్కొన్నారు. ‘టీకాలకు సంబంధించి అన్ని రకాల అంశాలపై పరిశోధించడానికి ఉన్నత స్థాయి నిపుణుల బృందం ఉంది. వచ్చే ఏడాది జులై కల్లా దాదాపు 400 నుంచి 500 మిలియన్ల కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అవి దాదాపు 25 కోట్ల మందికి మనం సరఫరా చేయడానికి వీలవుతుంది’ అని హర్షవర్దన్‌ వెల్లడించారు.

* కరోనా మహమ్మారిని ఎదుర్కొవడంలో వైద్య రంగం విశేషంగా కృషి చేస్తోంది. లక్షణాలను గుర్తించడం (ట్రేసింగ్‌), పరీక్షించడం (టెస్టింగ్‌), వైద్యం అందించడం (ట్రీట్‌మెంట్‌) వంటి వాటిని పక్కాగా అమలు చేయడంలోనూ కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు మెరుగ్గానే ఉన్నాయని చెప్పవచ్చు. పరీక్షలు ఎక్కువగా చేసి కరోనాను త్వరగా గుర్తించడం వల్ల మరణాల రేటును తగ్గించగలిగామని కేంద్రం వెల్లడించింది. అక్టోబర్‌ 3వ తేదీ వరకు దేశవ్యాప్తంగా దాదాపు 7.90 కోట్ల నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ పేర్కొంది. అంటే ప్రతి మిలియన్‌కు దాదాపు 57వేల టెస్టులను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. దేశంలో 65,49,373 కేసులు నమోదు కాగా.. 55లక్షల మందికిపైగా కోలుకున్నారు 9.37లక్షల మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటి వరకు 1,01,782 మంది మృతి చెందగా.. మరణాల రేటు 1.56శాతంగా ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.