Agriculture

ఒంగోలు జాతి పశువులు మాయం అవుతున్నాయి

Agricultural News - Ongole Cows Going Extinct

పరమశివుని వాహనం నందిని పోలిన ఆహర్యం.. ఎతైన మోపురం.. చూడముచ్చటైన రూపంతో అలరించిన ఒంగోలు జాతి పశువులు కనుమరుగైయ్యే పరిస్థితి తలెత్తింది. రాజసం ఉట్టిపడే ఆ వృషభానికి వందల సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగడంతో.. పశువులపై రైతుల్లో ఆసక్తి తగ్గింది.
**ప్రకాశం జిల్లాలో పుట్టిన ఒంగోలు జాతి పశువులు జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ రోజురోజుకు తగ్గుతున్నాయి. 2012 పశుగణన ప్రకారం రాష్ట్రంలో ఒంగోలు జాతి పశువులు 5.79లక్షలు ఉండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య మూడు లక్షలకు చేరుకుందని ఒక అంచనా. ఒక ప్రకాశం జిల్లాలోనే 2012లో ఒంగోలు జాతి ఆవులు, దూడలు, ఎద్దులు కలిపి 72వేలు ఉండేవి. 2017కు వచ్చే సరికి ఆసంఖ్య 64వేలకు పడిపోయింది.
వ్యవసాయంలో యంత్రాల వినియోగం పెరగడం.. రసాయనిక ఎరువులు వాడకంతో.. పశువుల ఉపయోగం తగ్గింది. దీనికి తోడు పల్లె ప్రజలకు పాలు ప్రధాన ఆదాయం కావడంతో గేదెలు.. జర్సీ ఆవుల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఒంగోలు జాతి పశువుల వృద్ధికి గుంటూరు, తిరుపతి, పశు పరిశోధనా కేంద్రాల ద్వారా పిండమార్పిడి, నాణ్యమైనవీర్యాన్ని సరఫరా చేయడం వంటి చర్యలకు కృషి జరుగుతోంది.
ప్రకాశం జిల్లా చదలవాడలోని పశుక్షేత్రంలో ఒంగోలు జాతి పశువుల వృద్ధికి చర్యలు తీసుకుంటున్నా.. ఏటా పదుల సంఖ్యలో ఉత్పత్తితో ఆశించిన మేరకు వృద్ధి జరగడంలేదు. వాటి సంఖ్యను పెంచడానికి చర్యలు చేపడుతున్నా రైతుల నుంచి కూడా ఆధరణ ఉండటం లేదు- షేక్ కాలేషా , పశువర్దక శాఖ డీడీ, ప్రకాశం
ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సాధించిన ఒంగోలు జాతి గిత్తలను గతంలో 10 నుంచి 15 లక్షల ధర పలికేవి. కానీ మారిన పరిస్థితుల కారణంగా ఇప్పుడు ఉన్నవాటినే ఎంతోకొంతకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై పశువులను, గ్రాసం అందిస్తే మళ్లీ ఒంగోలు జాతి పశువులు వృద్ధి చెందే అవకాశం ఉంది.ఒంగోలు జాతి పశువులు బ్రెజిల్‌, మలేసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా వంటి దేశాలలో 10 కోట్లకు పైగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.