Business

దేశవ్యాప్తంగా హౌసింగ్ మార్కెట్ ఢమాల్

దేశవ్యాప్తంగా హౌసింగ్ మార్కెట్ ఢమాల్

కరోనా మహమ్మారి పుణ్యమా? అని ఈ ఏడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సొంతిళ్ల కొనుగోళ్ల కోసం ముందుకు వచ్చిన వారే లేరు. గతేడాదితో పోలిస్తే 2020లో ఇళ్ల అమ్మకాలు దాదాపు సగం (47%) తగ్గిపోయాయి. నూతన వెంచర్లు 2020లో 46 శాతం తగ్గిపోయాయి. 2019లో 2.37 లక్షల ఇండ్లు కొత్తగా నిర్మిస్తే, ఈ ఏడాది అది 1.28 లక్షల యూనిట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ అనరాక్‌ వ్యాఖ్యానించింది.
*2019 లో 2.61 లక్షల ఇళ్లు అమ్ముడైతే, 2020లో అది కేవలం 1.38 లక్షలకే పరిమితమైందని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ అనరాక్‌ పేర్కొంది. అయినప్పటికీ ఈ ఏడాది చివరి త్రైమాసికంలో శక్తిమంతమైన వృద్ధిరేటు నమోదు కావడంతో వచ్చే ఏడాది (2021)లో తిరిగి ఇళ్ల అమ్మకాలు పెరుగుతాయని అనరాక్‌ ఇచ్చిన నివేదికలో తేలింది.
*దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2020 చివరి త్రైమాసికంలో సుమారు 50,900 ఇండ్లు అమ్ముడు పోగా గతేడాదితో పోలిస్తే 86%. ఇదిలా ఉంటే, గతేడాది ఫెస్టివ్‌ క్వార్టర్‌లో మొత్తం ఇండ్ల విక్రయాలు 59,160 యూనిట్లకు చేరుకున్నాయి. 2014లో నింగిని తాకేలా దూసుకెళ్లిన రెసిడెన్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం 2020లో పూర్తిగా కుదేలైంది. అయితే చౌక ధరలో ఇండ్ల కోసం డిమాండ్‌తో ఈ ఏడాది చివరి త్రైమాసికంలో రెసిడెన్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ పూర్వ వైభవానికి సంకేతాలు కనిపించాయని అనరాక్‌ అభిప్రాయ పడింది. ఏడు ప్రధాన నగరాల్లో ఇండ్లు అందుబాటులోకి తేవడంలో ఈ ఏడాది చివరి త్రైమాసికంలో స్వల్పంగా రెండు శాతం పురోగతి కనిపించింది. 2019లో 51,850 ఇండ్లు పంపిణీకి సిద్ధమైతే, ఈ ఏడాదిలో 52,820 యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌లో అత్యధికంగా 12,820 యూనిట్లు, తర్వాత ముంబై‌లో 11,910 యూనిట్లు కొనుగోలు దారులకు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యాయి.
అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌ చైర్మన్‌ ఆదిత్య పూరీ మాట్లాడుతూ ‘కరోనాతో అన్ని పరిస్థితులు తిరగబడినా.. 2020లో చివరి రెండు త్రైమాసికాల్లో రెసిడెన్షియల్‌ సెగ్మెంట్‌ ఇండ్ల విక్రయం ఊపందుకున్నది’ అని చెప్పారు. డిస్కౌంట్లు, ఆఫర్లు, ప్రభుత్వ బ్యాంకుల్లో తక్కువ వడ్డీపై ఇళ్ల రుణాలు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పరిమిత కాలంలో స్టాంప్ డ్యూటీ తగ్గింపు వంటి అంశాలతో రెసిడెన్షియల్‌ హౌసింగ్‌ సెగ్మెంట్‌లో డిమాండ్ ఊపందుకున్నదని తెలిపారు. బ్రాండెడ్‌ డెవలపర్ల నుంచి న్యూ ఇండ్ల సరఫరాకు ప్రాధాన్యం ఏర్పడిందన్నారు.