NRI-NRT

భారతీయులపై న్యూజీల్యాండ్ నిషేధం

భారతీయులపై న్యూజీల్యాండ్ నిషేధం

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో న్యూజిలాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు (ఆ దేశ పౌరులతో సహా) తమ దేశంలోకి ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఏప్రిల్‌ 11 నుంచి రెండు వారాల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు.
‘‘భారత్‌ నుంచి ప్రయాణికులెవరూ న్యూజిలాండ్‌లోకి రాకుండా ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. ఏప్రిల్‌ 11 సాయంత్రం 4 గంటల నుంచి ఏప్రిల్‌ 28 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. ప్రయాణికుల రాకపై తాత్కాలిక నిషేధం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను మేం అర్థం చేసుకోగలం. కానీ, వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’’ అని జెసిండా వివరించారు. అవసరమైతే నిషేధాన్ని మరింత కాలం పొడగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్‌ సరిహద్దుల్లో పనిచేసే సిబ్బందిలో ఓ వ్యక్తికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అంతేగాక, ఇటీవల విదేశాల నుంచి న్యూజిలాండ్‌కు వచ్చిన ప్రయాణికులకు సరిహద్దుల్లో పరీక్షలు నిర్వహించగా.. అందులో 23 మందికి కరోనా సోకినట్లు తేలింది. కాగా.. వీరిలో 17 మంది భారత్‌ నుంచి వచ్చినవారే కావడంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా సరిహద్దుల్లోనే వైరస్‌ను అడ్డుకునేలా న్యూజిలాండ్‌ కఠిన చర్యలు చేపడుతోంది. గత 40 రోజులుగా అక్కడ ఎలాంటి సామాజిక వ్యాప్తి కేసులు నమోదు కాలేదు. ఇదిలా ఉండగా.. భారత్‌లో గత కొద్ది రోజులుగా కొవిడ్‌ విజృంభణ కొనసాగుతోంది. రోజువారీ కొత్త కేసుల్లో గణనీయ వృద్ధి ఆందోళన కలిగిస్తోంది.