NRI-NRT

రైతుసేవలో రామ్‌చౌదరి

రైతుసేవలో రామ్‌చౌదరి

వర్జీనియాకు చెందిన ప్రవాసాంధ్ర ప్రముఖుడు ఉప్పుటూరి రామ్‌చౌదరి తన స్వగ్రామం గుంటూరు జిల్లా పుల్లడిగుంట పరిసర గ్రామాల్లో తానా సహకారంతో రైతులకు అవసరమైన సౌకర్యాలను కల్పించారు. తన గ్రామంలో దాదాపు 500ఎకరాల్లో భూమిని ట్రాక్టర్లు ఏర్పాటు చేయించి దుక్కి దున్నించారు. జులై 1వ తేదీన రైతు దినోత్సవం సందర్భంగా నూజివీడు సీడ్స్ బీటీ పత్తి విత్తనాలను ఆ గ్రామ రైతులకు ఉచితంగా అందజేశారు. రాజధాని రైతు పరిరక్షణ కమిటీ కన్వీనర్ ముప్పాళ్ల నాగేశ్వరరావు చేతుల మీదుగా ఈ పంపిణీ చేపట్టారు. ఇది గాక ఆ ప్రాంతంలోని నిరుపేదలకు తానా తరఫున ఉచితంగా బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. రైతు కుటుంబాలకు అవసరమైన సేవలు అందించడానికి తాను సదా అందుబాటులో ఉంటానని రామ్‌చౌదరి పేర్కొన్నారు. తాను చేపట్టిన కార్యక్రమాలకు చేయూతనందిస్తున్న తానా అధ్యక్షుడు తాళ్లురి జయశేఖర్, ఫౌండేషన్ వల్లేపల్లి శశికాంత్ తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.