WorldWonders

అల్లుడికి 21విషనాగులను కట్నంగా ఇచ్చిన మామ

అల్లుడికి 21విషనాగులను కట్నంగా ఇచ్చిన మామ

చట్ట ప్రకారం వరకట్నం ఇచ్చినా, తీసుకున్నా నేరం. 1961, మే 1న మన దేశంలో అధికారికంగా నిషేధించినా.. ఈ చట్టం కేవలం పేపర్ల వరకే పరిమితం అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే.. నేటికీ వరకట్న ఆచారం యధేచ్చగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ డబ్బు, బంగారం, వాహనాలు, పొలాలు, స్థలాలు రూపంలో పద్ధతులు, ఆచారాల పేరిట మగ పెళ్లివారికి సమర్పించుకోవడం రివాజుగా ఉంది. ఐతే ఈ గ్రామంలో పెళ్లిల్లకు డబ్బు, బంగారాభరణాలతోపాటు 21 అత్యంత విషపూరితమైన పాములను కూడా భరణంగా ఇస్తారట. వింతగా అనిపించినా దీని వెనుక ప్రత్యేక కారణం ఉంది. ఆదేమిటో తెలుసుకుందాం.. మధ్యప్రదేశ్‌లోని గౌరియా తెగవారు ఈ వింత ఆచారాన్ని శతాబ్ధాలుగా అనుసరిస్తున్నారు. కూతురికి వివాహం చేస్తే అల్లుడికి విషపూరితమైన 21 పాములను కట్నంగా ఇస్తారట. ఈ విధంగా కట్నం సమర్పించుకోకపోతే ఆ పెళ్లి కొంతకాలానికే పెటాకులౌతుందని వారి నమ్మకం. అంతేకాదు, ఈ తెగ జీవనోపాధికూడా పాములను పట్టడమేనట. పట్టిన పాములను జనాల ముందు ఆడించటం ద్వారా డబ్బు సంపాదిస్తారట. కట్నంగా వచ్చిన పాముల ద్వారా డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించుకోవాలనే ఆడపిల్ల తండ్రి తన అల్లుడికి పాములను కట్నంగా ఇస్తాడు. అందుకే ఆడపెళ్లివారు మగపెళ్లివారికి కట్నంగా 21 పాములను ఇచ్చుకుంటారు. కట్నంగా తీసుకున్న పాములను కఠిన నియమాలతో చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఒకవేళ భద్రపరచిన బాక్సులో పాము మరణిస్తే దాన్ని అశుభంగా పరిగణిస్తారు. అంతేకాకుండా కుటుంబం మొత్తం గుండు చేయించుకుంటారట కూడా. వింత జనాలు.. వింత ఆచారాలని అనుకుంటున్నారా!! దేశ మూలమూలల్లో ఇంకెలాంటి వింత కట్నాలు, భరణాలు ఆచరణలో ఉన్నాయో..