Business

హైదరాబాద్‌లో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణం!

హైదరాబాద్‌లో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణం!

దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో రూ.4.8 లక్షల ఇళ్ల యూనిట్లు నిర్మాణం పూర్తి కాకుండా నిలిపోయాయి. వీటి విలువ రూ.4.48 లక్షల కోట్లుగా ఉంటుందని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ అనరాక్‌ తెలిపింది. ఇందులో హైదరాబాద్‌ మార్కెట్‌కు సంబంధించి నిర్మాణం కాకుండా నిలిచిపోయిన యూనిట్లు 11,450 యూనిట్లు కూడా ఉన్నాయి. వీటి విలువ రూ.11,310 కోట్లుగా ఉందని అనరాక్‌ నివేదిక వెల్లడించింది.

*పూర్తయినవి
2014, అంతకు ముందు సంవత్సరాల్లో ఆరంభమై, పూర్తికాని ప్రాజెక్టులను అనరాక్‌ ఈ నివేదికలోకి తీసుకుంది. వీటిల్లో ఈ ఏడాది జనవరి–మే మధ్య కాలంలో 36,830 యూనిట్లను బిల్డర్లు పూర్తి చేసినట్టు అనరాక్‌ తెలిపింది. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌), కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పుణె పట్టణాల గణాంకాలు ఈ నివేదికలో ఉన్నాయి. ‘‘ఇలా నిలిచిన ప్రాజెక్టులను పూర్తి చేసే ఉద్దేశ్యంతో డెవలపర్లు ఉన్నారు. ప్రస్తుతం రెడీ టు మూవ్‌ ఇళ్లకు ఉన్న డిమాండ్‌ను వారు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్నారు’’అని అనరాక్‌ సీనియర్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ ఠాకూర్‌ తెలిపారు.

**నివేదికలోని అంశాలు..
2021 చివరికి నిర్మాణం కాకుండా నిలిచిన ఇలాంటి ఇళ్లు 5.17లక్షల యూనిట్లుగా ఉన్నాయి. భారీ సంఖ్యలో ఇళ్ల ప్రాజెక్టులు నిలిచిపోయినందున.. పెద్ద డెవలపర్లు, ప్రభుత్వరంగ ఎన్‌బీసీసీ వాటిని తమ నిర్వహణలోకి తీసుకుని పూర్తి చేస్తున్నట్టు అనరాక్‌ తెలిపింది. దీంతో 2022 జనవరి నుంచి మే వరకు 36,830 యూనిట్లు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్ల యూనిట్లలో 77 శాతం ఢిల్లీ ఎన్‌సీఆర్, ఎంఎంఆర్‌లోనే ఉన్నాయి. ఈ రెండు పెద్ద మార్కెట్లు కావడం గమనార్హం. పుణెలో 9 శాతం, కోల్‌కతాలో 5 శాతం చొప్పున ఇళ్ల యూనిట్లు నిర్మాణం కాకుండా ఉన్నాయి. దక్షిణాది నగరాలైన హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో నిర్మాణం కాని యూనిట్లు మొత్తం యూనిట్లలో 9 శాతంగానే ఉన్నాయి.

*హైదరాబాద్‌ మార్కెట్‌..
2014, అంతకుముందు నిర్మాణం ప్రారంభమై ఇప్పటికీ పూర్తి కాని ఇళ్లు హైదరాబాద్‌లో 11,450 యూనిట్లు కాగా, వీటి విలువ రూ.11,310 కోట్లు. 2021 డిసెంబర్‌ నాటికి ఇలాంటి యూనిట్లు 13,160 ఉండగా, వీటి విలువ రూ.12,995 కోట్లుగా ఉంటుందని అనరాక్‌ నివేదిక తెలిపింది. వీటిల్లో 2022 జనవరి నుంచి మే మధ్య 1,710 యూనిట్ల నిర్మాణాన్ని డెవలపర్లు పూర్తి చేశారు.