అమెరికాలో నివాసం ఉంటున్న ప్రముఖ ప్రవాసాంధ్రులు గుత్తికొండ శ్రీనివాస్, ఐకా రవిలు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ₹10కోట్లు విరాళంగా అందించారు. ఈ నిధులతో ఆలయాన్ని పునర్నిర్మించారు.
కాణిపాకంలో చతుర్వేద హవన సహిత మహాకుంభాభిషేకం పూజలు సోమవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. పూజలు నిర్వహించడానికి ఆలయ అలంకార మండపం వద్ద యాగశాలను ఏర్పాటు చేశారు. 21న ఆలయంలో జరిగే మహాకుంభాభిషేకాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు యాగశాలలో పూజలు. హోమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణ దాతలు ఐకా రవి దంపతులు, గుత్తికొండ శ్రీనివాస్ దంపతులు, ఆలయ అధికారులు పూజాద్రవ్యాలను ఆలయ మాడవీధుల ద్వారా ఆలయంలోకి తీసుకొచ్చారు. అంకుర్పారణ నిర్వహించారు. యాగశాలలో వేదస్వస్తి, గణపతిపూజ, స్వస్తివాచనం, ఋత్విగ్వరుణ, పర్యగ్నీకరణం, మృత్సంగ్రహణం, రక్షాబంధనం, వాస్తుశాంతి, అంకురార్పణ, అఖండ దీపారాధనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో సురే్షబాబు, ఈఈ వెంకటనారాయణ, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కస్తూరి, ఏఈవోలు విద్యాసాగర్రెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, రవీంద్రబాబు, హేమమాలిని, సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీధర్బాబు, శ్రీనివాస్, ఆలయ ఇన్స్పెక్టర్లు రమేష్, బాబు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయ నిర్మాణంలో అద్భుతం చోటు చేసుకుంది. సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయ రూపురేఖలు పూర్తిగా మార్పు చేశారు. గతంలో ఉన్న పాత ఆలయాన్ని తొలగించి దాని స్థానంలో పొడవు, వెడల్పు, ఎత్తు పెంచి నూతన ఆలయ నిర్మాణం చేపట్టారు. భక్తుల ఇబ్బందులు గుర్తించి చరిత్రలో నిలిచిపోయేలా పునర్నిర్మించారు. ఆలయ నిర్మాణం గతేడాది నవంబరు నెలలో ప్రారంభ మైంది. ఇందుకు గుంటూరు జిల్లా కోటప్పకొండ నుంచి 42 వేల ఘనపుటడుగుల కృష్ణశిల(రాయి) తీసుకొచ్చి నిర్మించారు. తంజావూరు, మదురై, పుదుకోట, కుప్పానికి చెందిన సుమారు 100 మంది శిల్పులు, 50మంది కూలీలు నిర్మాణంలో పాల్గొన్నారు. భారతీయ శిల్ప కళ ఉట్టిపడేలా బొమ్మలు చెక్కారు. విమాన గోపురంపై వివిధ రూపాలైన వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆలయ గర్భాలయం చుట్టూ దక్షిణామూర్తి, బ్రహ్మ, విష్ణుమూర్తిని, అర్ధమండపం చుట్టూ వినాయకుడు, దుర్గా దేవి విగ్రహాలు అమర్చారు. మహామండపంలోని ఏకశిల స్తంభాలపై ఏనుగులు, యాళీ, భూతాలు చెక్కారు. అర్ధమండపం పైభాగంలోని మండపాల్లో శివపార్వతులు, సిద్ధిబుద్ధి సమేత వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాలు ఏర్పాటు చేశారు. దీంతో ఆలయంలో శిల్పకళ ఉట్టిపడుతోంది. ఈ నెల 21న స్వామివారి ప్రధాన ఆలయంలో చతుర్వేదహవన సహిత మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు.