Politics

అవినీతి, అక్రమాలకు ప్రతిరూపం జగన్‌రెడ్డి: చంద్రబాబు

అవినీతి, అక్రమాలకు ప్రతిరూపం జగన్‌రెడ్డి:  చంద్రబాబు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం కర్నూలు జిల్లా, ఓర్వకల్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడ టీడీపీ నేతలు, విద్యార్థులు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన ఎయిర్ పోర్ట్ వద్ద విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఇబ్బందులను విద్యార్థులు చెప్పుకున్నారు. ‘జాబు రావాలి అంటే.. బాబు రావాలి’ అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఐదేళ్లలో రాష్ట్రంలో 16 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయన్నారు. అవి కొనసాగి ఉంటే 30 లక్షల ఉద్యోగాలు వచ్చేవని, అప్పటికే 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఇప్పుడు ఉద్యోగాల కోసం హైదరాబాద్ ఎందుకు వెళ్లాల్సి వస్తుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎయిర్ పోర్టు ఎవరు కట్టారన్నారు. కర్నూల్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ కోసం 10 వేల ఎకరాలు ఇచ్చామన్నారు.

కర్నూలు జిల్లాకు సీడ్ పార్క్ తెచ్చామని, సోలార్ పార్క్ తెస్తే కమీషన్‌ల కోసం జగన్ రెడ్డి నిలిపివేశారని.. అది సెట్ చేసుకుని మళ్లీ ప్రారంభించారని చంద్రబాబు అన్నారు. అభివృద్ధికి టీడీపీ మారుపేరన్నారు. ప్రతి కార్యక్రమం ఇక్కడ టీడీపీ హయాంలోనే జరిగిందన్నారు. హైదరాబాద్ ఉన్న తెలంగాణ కంటే ఏపీ అభివృద్ధి చెందాలని అనుకున్నామని, అందుకే అమరావతి తలపెట్టామని స్పష్టం చేశారు. యువతలో చైతన్యం రావాలని, వాస్తవాలు ప్రజలకు చెప్పాలన్నారు. ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఉంటుందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. సీఎం జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారని.. నాడు వైఎస్సార్ హైటెక్ సిటీ కూల్చివేసి ఉంటే తరువాత అభివృద్ధి జరిగేదా? అని అన్నారు. కర్నూల్ జిల్లాలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు నిలిపివేశారని విమర్శించారు. జగన్ రెడ్డి తండ్రి వైఎస్‌ను కూడా గౌరవించలేదని, అయన తెచ్చిన వేమన యూనివర్సిటీలో వేమన విగ్రహం తొలగించారన్నారు. కర్నూల్‌లో పరిశ్రమలు రావాలని 10 వేల ఎకరాలలో టౌన్ షిప్ తెచ్చామన్నారు. నాడు సోలార్ ప్రాజెక్టులు తెచ్చి ఉపాధి కల్పించామన్నారు. నేడు రాయలసీమ యూనివర్సిటీలో సిబ్బందికి కనీసం జీతాలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాంగోపాల్ రెడ్డిని గెలిపించమని కోరారు. యువత భవితకు తనది భరోసా అని చంద్రబాబు స్పష్టం చేశారు