Politics

ఎన్నికల విధుల నుంచి తప్పించమని ఉపాధ్యాయులే అడిగారు:మంత్రి బొత్స

ఎన్నికల విధుల నుంచి తప్పించమని ఉపాధ్యాయులే అడిగారు:మంత్రి బొత్స

శ్రీకాకుళం: ఉపాధ్యాయుల కోరిక మేరకే వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని..సీఎం ఇచ్చిన హామీలన్నీ నెరవేస్తున్నారని తెలిపారు. శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో మంత్రి సీదిరి అప్పరాజు, పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన శనివారం సమావేశం నిర్వహించారు. ఈ నెల 7న విజయవాడలో జరిగే ‘జయహో బీసీ’ మహాసభను విజయవంతం చేయాలని బొత్స పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఓడిపోతామనే భయంతోనే ఎన్నికల విధుల నుంచి టీచర్లను తప్పించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అంటున్నారని దానిపై మీ స్పందనేంటి? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ”ఆయనను వచ్చి టీచర్లను అడగమనండి. ఉపాధ్యాయులే ‘సార్‌.. మాకు ఏవిధమైన విధులు ఉండకూడదు. బోధించడం తప్ప ఏవిధమైన కార్యక్రమాలు మాకు అప్పగించొద్దు’ అని రిక్వెస్ట్‌ చేశారు. దానిని పరిగణనలోకి తీసుకొనే ఉపాధ్యాయులకు మేం వెసులుబాటు కల్పించాం. మా నాయకుడు జగన్‌ చెప్పిన మాదిరి రాష్ట్రంలో చేసిందే చెప్తున్నాం.. చేయబోయేదీ చెప్తున్నాం” అని బొత్స అన్నారు.