Devotional

శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు..

శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు..

ఉగాది ఉత్సవాలకు సిద్ధం

భక్తులకు స్వామివారి అలంకార దర్శనమే

శ్రీశైలం, మార్చి 17: శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ఈనెల 19న ప్రారంభమై 23 వరకు జరగనున్నాయి. ఐదు రోజులపాటు నిర్వహించే ఉగాది మహోత్సవాలకు దేవస్థానం భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. కర్ణాటక రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. పాదయాత్రగా భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలానికి ఇప్పటికే చేరుకున్నారు.

దర్శనం ఏర్పాట్లు: భక్తుల రద్ధీని దృష్టిలో ఉంచుకొని స్వామివారి అలంకరణ దర్శనం మాత్రమే కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. మూడు క్యూలైన్ల ద్వారా ఉచిత దర్శనం, శీఘ్రదర్శనం (రూ. 200), అతిశీఘ్ర దర్శనం(రూ.500) కల్పించనున్నారు.

అన్నప్రసాద వితరణ: దేవస్థానం భక్తులకు అన్నదాన భవనంలో అన్నప్రసాద వితరణ నిర్వహిస్తుంది. అదేవిధంగా నాగులూటి, కైలాసద్వారం, క్షేత్ర పరిధిలో పలు చోట్ల కన్నడ భక్త బృందాలు, సేవాసంస్థలు అన్నదానం నిర్వహిస్తున్నాయి.

తాత్కాలిక వసతి: ఉగాది మహోత్సవాలకు విచ్చేసే భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు ఆరుబయట ప్రదేశాలలో పైప్‌ పెండాల్స్‌, షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. క్షేత్రపరిధిలోని శివదీక్షా శిబిరాలు, బాలగణేశ సదనం, మల్లమ్మ కన్నీరు, రుద్రాక్షవనం, ఆలయ మాఢవీధులు తదితర ఆరుబయలు ప్రదేశాలలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.