Politics

నలుగురు ఎమ్మెల్యేలపై వేటుకు తెదేపా సన్నద్ధం..

నలుగురు ఎమ్మెల్యేలపై వేటుకు తెదేపా సన్నద్ధం..

టీడీపీ తరుఫున ఎన్నికై వైసీపీ ఎమ్మెల్యేలుగా చెలామణి అవుతోన్న నలుగురిపై అనర్హత వేటు పడే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ నలుగిరికి టీడీపీ విప్ జారీ చేసింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటేయాలని మద్దాలి గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లిలకు కూడా విప్ జారీ చేశారు.

ఈ నలుగురు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీ ఎన్నికలు కత్తి మీది సాములా మారాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పనిసరిగా పాల్గొనాలి. కాదు కూడదని ఓటింగ్ కు గైర్హాజరు అయిన టీడీపీ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తుంది. విప్ ధిక్కరణ వ్యవహారం కావడంతో స్పీకర్ కూడా ఈ విషయంలో నాన్చడానికి వీలు లేదు. వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో నలుగురు ఎమ్మెల్యేలు అటు టీడీపీకి ఒటేస్తారా..? లేక వైసీపీకి మద్దతుగా నిలిచి ఉప ఎన్నికలకు కారణం అవుతారా..? అన్నది బిగ్ డిబేట్ గా మారింది.

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఏడు స్థానాలకు ఈ నెల 23న మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏడు స్థానాలకు వైసీపీ అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ తరపున పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగారు. అసెంబ్లీలో మొత్తం 175 మంది సభ్యులు ఉన్నారు. ఏడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న తొలి ఏడుగురు ఎమ్మెల్సీలు అవుతారు. వైఎస్ఆర్సిపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఈ బలంతో ఆరుగురు మాత్రం గెలవగలరు. కానీ ఏడో సీటు కోసం టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఓటు వేస్తే గెలుస్తుంది. కానీ వారు ఎటు వైపు నిలుస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారింది.

ఇక వైసీపీ అసమ్మత్తి ఎమ్మెల్యేలు ఇద్దరు ఆత్మప్రబోధానుసారం ఓటేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అయినప్పటికీ వైసీపీ మాత్రం విప్ జారీ చేయబోమని చెబుతోంది. విప్ జారీ చేస్తే ఇద్దరు వైసీపీ అసమ్మత్తి ఎమ్మెల్యేలకు కూడా వర్తిస్తుంది. అదే జరిగితే వారు పార్టీకి ఓటు వేయకపోతే వారిపైనా అనర్హతా వేటు పడుతుంది. అది ఉప ఎన్నికలకు దారితీస్తుంది. ఇప్పుడున్న సమయంలో ఉప ఎన్నికలకు వెళ్తే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావంతో బై ఎలక్షన్ లోనూ టీడీపీ గెలిచే అవకాశాలను కొట్టిపారేయలేం. ఈ ప్రభావం సాధారణ ఎన్నికలపై ఉంటుంది అందుకే వైసీపీ విప్ జరీ చేసే ఆలోచనను విరమించుకుంది.