Politics

భాస్కర్‌ రెడ్డికి 14 రోజులు రిమాండ్

భాస్కర్‌ రెడ్డికి 14 రోజులు రిమాండ్

చంచల్‌గూడ జైలుకు తరలింపు

హైదరాబాద్ : వివేకా హత్య కేసులో కుట్రదారుడిగా భాస్కర్‌ రెడ్డిపై అభియోగాలు ఉన్నాయన్న సీబీఐ ఆదివారం ఆయన్ను పులివెందులలో అరెస్ట్ చేసి, హైదరాబాద్‌కు తరలించింది. ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సీబీఐ జడ్జి ముందు హాజరుపరుచగా 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో అధికారులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి తండ్రి భాస్కర్‌ రెడ్డిని ఆదివారం ఉదయం పులివెందులలో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు తరలించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం భాస్కర్ రెడ్డిని ఉస్మానియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో భాస్కర్‌ రెడ్డికి ఉస్మానియా వైద్యులు వైద్య పరీక్షలను నిర్వహించారు. వైద్య పరీక్షల్లో భాస్కర్‌ రెడ్డికి స్వల్పంగా రక్తపోటు పెరగినట్లు వెల్లడించారు. వైద్య పరీక్షలు ముగియడంతో సీబీఐ అధికారులు ఆయనను ఉస్మానియా ఆసుపత్రి నుంచి సీబీఐ జడ్జి ముందు హాజరుపరచగా భాస్కర్‌ రెడ్డికి 14 రోజులు (ఈనెల 29 వరకు) రిమాండ్ విధించారు. దీంతో అధికారులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

వివరాల్లోకి వెళ్తే వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో వేగం పెంచిన సీబీఐ ముందుగా హైదరాబాద్‌లోని అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లింజి. ఇంట్లో అవినాష్ రెడ్డి లేకపోవడంతో కడప జిల్లా పులివెందులలోని భాస్కర్‌ రెడ్డి, అవినాష్‌ రెడ్డి నివాసాలకు 2 వాహనాల్లో సీబీఐ బృందం వెళ్లింది. వివేకా హత్య కేసులో ఇప్పటికే అవినాష్‌ రెడ్డిని పలుమార్లు ప్రశ్నించిన సీబీఐ అధికారులు కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని ఉదయం 6 గంటలకు ఇంట్లోనే అరెస్ట్ చేశారు. అరెస్ట్ మెమోను భాస్కర్ రెడ్డి భార్య లక్ష్మీకి సీబీఐ అధికారులు అందజేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డిని 120-బి రెడ్ విత్ 302, 201 ఐపీసీ సెక్షన్ల కింద అరెస్ట్ చేసినట్లు మెమోలో పేర్కొన్నారు. అనంతరం వివేకా హత్య కేసులో కుట్రదారుడిగా భాస్కర్‌ రెడ్డిపై అభియోగాలు ఉన్నాయని సీబీఐ పేర్కొంది. వివేకా గుండెపోటుతో మరణించినట్లు తొలుత ప్రచారం చేయడంలో భాస్కర్‌ రెడ్డి పాత్ర ఉన్నట్లు అభియోగాలు ఉన్నట్లు సీబీఐ తెలిపింది. సాక్ష్యాలు చెరిపేయడంలో కూడా భాస్కర్‌ రెడ్డి పాత్ర ఉన్నట్లు, హత్యకు ముందు భాస్కర్‌ రెడ్డి ఇంట్లో సునీల్‌ ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని సీబీఐ వివరించింది. పులివెందులలో వైఎస్‌ భాస్కర్‌ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు ఆయన్ను హైదరాబాద్‌కు తీసుకెళ్లి సాయంత్రంలోపు సీబీఐ జడ్జి ఎదుట హాజరుపరచనున్నామని తెలిపారు. భాస్కర్‌ రెడ్డిని 120బి రెడ్‌విత్‌ 302, 201 సెక్షన్ల కింద అరెస్టు చేసినట్లు కుటుంబ సభ్యులకు సీబీఐ తెలియజేసింది.

ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల కోసం వైఎస్‌ భాస్కర్‌ రెడ్డిని ఉస్మానియా ఆస్పత్రికి సీబీఐ అధికారులు తరలించారు. వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత సీబీఐ అధికారులు జడ్జి నివాసానికి తరలిస్తున్నారు. వైద్య పరీక్షల్లో భాగంగా భాస్కర్‌ రెడ్డికి స్వల్పంగా రక్తపోటు పెరిగినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు తండ్రిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారని తెలుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి.. పులివెందులకు చేరుకున్నారు. అరెస్టు సమయంలో భాస్కర్‌ రెడ్డి భార్య లక్ష్మికి ఇచ్చిన అరెస్టు మెమోను అవినాష్‌రెడ్డికి చూపించారు.