Politics

వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టు పై జేడీ వ్యాఖ్యలు

వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టు పై జేడీ వ్యాఖ్యలు

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఈ కేసు సుప్రీం కోర్టు వరకు వెళ్లడం.. డీఐజీ స్థాయి అధికారిని నియమించడం.. ఈ నెలాఖరులోగా కేసును పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించిందన్నారు. దీంతో సీబీఐ విచారణ వేగవంతం చేసిందన్నారు. ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేయడం. విచారణలో ఆయన ఇచ్చిన సమాచారంతో ఇవాళ వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. కాన్‌స్పిరసీ థీరీస్ (కుట్ర జరిగిందనే వాదన) ఎలా ఉంటుందంటే.. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విశాఖ వరకు రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొందరు విజయవాడ వరకు వస్తారని, కొంతమంది రాజమండ్రిలో దిగుతారని, మరికొందరు చివరి విశాఖ వరకు వస్తారన్నారు. వారంతా కాన్‌స్పిరసీలో భాగస్వాములేనన్నారు. 120 బి చాలా పెద్ద సెక్షన్ అని, ఇది అందరినీ అందులో సమావేశం చేస్తుందన్నారు. హైదరాబాద్ నుంచి విశాఖ వరకు ఎవరు ప్రయాణం చేస్తారో వారికి అంతా తెలుస్తుందని.. మధ్య మధ్యలో ఉన్నవారికి కొంత విషయం మాత్రమే తెలుస్తుందన్నారు. ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత వెల్లడైన విషయాల ఆధారంగా ఈ రోజు వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారని జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంకా ఎంతమంది ఉన్నది.. ఎవరి ప్రోత్సాహం వల్ల జరిగింది అన్నది విచారణలో తేలుతుందని అన్నారు. ఒక ఎంపీ స్థాయి వ్యక్తి హత్య ఇన్ని సంవత్సరాలు పట్టడం సరికాదన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏప్రిల్ 30వ తేదీ నాటికి విచారణ పూర్తి చేసి సీబీఐ నివేదికను సుప్రీం కోర్టుకు అందుజేస్తుందని తాను భావిస్తున్నట్లు జేడీ లక్ష్మినారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు.