NRI-NRT

రేపటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన..

రేపటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన..

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. శుక్రవారం నుంచి ఆయన పర్యటన ప్రారంభం కానుంది. 6 రోజుల్లో మూడు దేశాల సందర్శించనున్నారు. జపాన్‌, పాపువా న్యూ గినియా, ఆస్ట్రేలియా దేశాల్లో సుడిగాలి పర్యటన చేస్తారు ప్రధాని మోదీ. క్వాడ్‌ సదస్సు రద్దైనా ఆస్ట్రేలియా సందర్శించాలని నిర్ణయించుకున్నారు ప్రధాని. దాదాపు 25 మందికి పైగా ప్రపంచ నాయకులతో భేటీ కానున్నారు. ఇక విదేశీ పర్యటనలో భాగంగా 40 కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ప్రధాని మోదీ. ప్రధాని పర్యటన సంపూర్ణం, చారిత్రాత్మకమని పీఎంవో అభివర్ణించింది. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మూడు దేశాల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నాడు ఢిల్లీ నుంచి బయలుదేరుతున్నారు. ముందుగా జపాన్‌లోని హిరోషిమాలో జరిగే G7 సమావేశంలో పాల్గొంటారు. కీలకమైన G7 గ్రూప్‌లో భారత్‌ సభ్య దేశం కానప్పటికీ అతిధి దేశంగా పాల్గొనాలని జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా ఇండియాను ఆహ్వానించారు. G7 గ్రూప్‌కు ప్రస్తుతం జపాన్‌ అధ్యక్షత వహిస్తోంది. G7 గ్రూప్‌లో ప్రధాని మోదీ పాల్గొనడం ద్వారా G7, G20 దేశాల మధ్య బంధం బలపడుతుందని జపాన్‌ భావిస్తోంది.

మరో వైపు ఆస్ట్రేలియాలో ఈ నెల 24న జరగాల్సిన క్వాడ్‌ సదస్సు వాయిదా పడటంతో హిరోషిమాలోనే క్వాడ్‌ దేశాధినేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భారత్‌ భావిస్తోంది. జపాన్‌ పర్యటన అనంతరం ప్రధాని మోదీ పాపువా న్యూ గినియా దేశాన్ని సందర్శిస్తారు. భారత ప్రధాని ఒకరు పాపువా న్యూ గినియా దేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. అక్కడ ఇండో-పసిఫిక్‌ దీవుల సహకార ఫోరమ్‌ మూడో శిఖరాగ్ర సదస్సుల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ ఫోరమ్‌ను 2014లో ఏర్పాటు చేశారు. పసిఫిక్‌ మహాసముద్రంలో 14 దీవులు, దేశాలు సభ్యులుగా ఉన్నాయి.

మూడు దేశాల పర్యటనలో చివరగా ఈ నెల 22న ప్రధాని మోదీ ఆస్ట్రేలియా సందర్శిస్తారు. ఇక్కడ జరిగే క్వాడ్‌ సదస్సులో పాల్గొనాల్సి ఉంది. కాని, అమెరికా అధ్యక్షుడు జో బైడైన్‌ తన పర్యటనను వాయిదా వేసుకోవడంతో క్వాడ్‌ సదస్సు రద్దైంది. అయినప్పటికీ ఆస్ట్రేలియాను సందర్శించాలని ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని ఆంటోని ఆల్బనీస్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆస్ట్రేలియాకు చెందిన సీఈఓలు, వ్యాపారవేత్తలతోనూ ప్రధాని సమావేశమవుతారు. మే 23న సిడ్నీలో వేలాది మంది ప్రవాస భారతీయులను కలుస్తారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌ కూడా పాల్గొంటారు.

మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ దాదాపు 40కి పైగా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రముఖ వ్యక్తులు, విద్యావేత్తలతోనూ భేటీ అవుతారు. ఈ పర్యటన సంపూర్ణమైనది, చారిత్రాత్మకమని భారత్‌ అభివర్ణించింది. ఈ పర్యటనలో సంస్కృతి నుంచి వాణిజ్యం వరకు, ప్రవాసుల నుంచి దౌత్యనీతి వరకు అన్ని ఇమిడి ఉన్నాయని భారత్‌ ప్రకటించింది.