Politics

పవన్ కోసం సాహసం చేసిన వీరాభిమాని

పవన్ కోసం  సాహసం చేసిన వీరాభిమాని

జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు తిరుపతికి వెళ్లిన సంగతి తెలిసిందే. జనసేన నేత సాయిపై శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకున్నారు. ఆమె పై ఫిర్యాదు చేయడానికి పవన్ కళ్యాణ్ ఈ రోజు తిరుపతికి వెళ్లారు. ఎయిర్ పోర్టు నుంచీ ఆయన తిరుపతి ఎస్పీకి బయల్దేరారు. భారీ ర్యాలీతో ఆయన ఎయిర్ పోర్టు నుంచి వెళ్లారు. అయితే, మార్గంమధ్యలో ఎవరూ ఊహించని ఓ పరిణామం జరిగింది. ఆయన అభిమాని ఒకరు క్రేన్ సహాయంలో గాలిలో వేలాడుతూ వచ్చి పవన్ కళ్యాణ్‌కు శాలువా కప్పి పూల మాలతో సన్మానించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.పవన్ కళ్యాణ్ ర్యాలీగా వస్తుండగా.. కారులో నిలబడి అభిమానులకు అభివాదం చేస్తున్నారు. కాగా, ఆ అభిమాని రోడ్డు పక్కన క్రేన్ పెట్టుకుని దానికి తనను తాను వేలాడదీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ సమీపించగానే ఆయన అటువైపుగా కదిలాడు. ఆయనను చూసి పవన్ కళ్యాణ్ కూడా విస్మయం చెందారు. వద్దు అన్నట్టుగా మొదలు సంజ్ఞ చేసినా.. కారు ముందుకు వెళ్లుతుండగా.. ఆ అభిమానిని సమీపించారు.

చివరకు ఆ అభిమాని పవన్ కళ్యాణ్‌కు శాలువా కప్పారు. ఆ తర్వాత పూలమాలను తీయగా.. దాన్ని చేతిలోకి తీసుకునే ప్రయత్నం పవన్ చేశారు. కానీ, ఆ అభిమాని పవన్ కళ్యాణ్ మెడలో వేసి చేతుల్లో చేయిలు వేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ముందుకు సాగిపోగా.. ఆ అభిమాని అక్కడే వేలాడుతూ ఇతరులకు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. ఈ వీడియోపై ఇదేం పిచ్చి అని కొందరు వాపోతుండగా.. మరికొందరు అభిమానానికి హద్దులు ఉండవని కామెంట్లు చేస్తున్నారు.