Politics

ఈ నెల 22 న దక్షిణాఫ్రికా వెళ్లనున్న మోడీ

ఈ నెల 22 న దక్షిణాఫ్రికా వెళ్లనున్న మోడీ

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఆగస్టు 22 నుంచి 24 వరకు జరగనున్న బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే సమ్మిట్ లో పాల్గొనేందుకు మోడీ జోహన్నెస్ బర్గ్ వెళ్లనున్నట్లు సమాచారం. బ్రిక్స్ సభ్య దేశాలపై ఆధిపత్యం చెలాయించడానికి చైనా ప్రయత్నిస్తున్నప్పటికీ, బ్రెజిల్‌తో పాటు భారతదేశం కూడా తన పాత్ర గురించి బలమైన సందేశాన్ని బ్రిక్స్ దేశాలకు పంపనున్నట్లు హిందూస్థాన్ టైమ్స్ నివేదిక పేర్కొంది.

సౌదీ అరేబియా, యూఏఈ వంటి సన్నిహిత మిత్ర దేశాలు బ్రిక్స్‌లో చేరాలని భావిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ దక్షిణాఫ్రికా పర్యటన చాలా కీలకమైంది. బ్రిక్స్‌లో చేరేందుకు దాదాపు 25 దేశాలు దరఖాస్తు చేసుకున్నాయి. వాస్తవానికి బ్రిక్స్ ఐదు దేశాల సంస్థ.. దీనిని మరింతగా విస్తరించాలా వద్దా అనే దానిపై జోహన్నెస్‌బర్గ్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.ప్రధాని మోడీ జోహన్నెస్‌బర్గ్‌కు వెళ్లేందుకు నిర్ణయం తీసుకునే ముందు.. ఆయన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు మాటెమెలా సిరిల్ రమఫోసాతో ఫోన్‌లో సంభాషించారు. ఈ సందర్భంగా రమాఫోసా బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీని ఆహ్వానించారు. బ్రిక్స్ సదస్సు కు చేస్తోన్న సన్నాహాలను కూడా వివరించారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడి ఆహ్వానాన్ని మన్నించి, సమ్మిట్ కోసం జోహన్నెస్‌బర్గ్‌కు వెళ్లేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మన ప్రధాని మోడీ చెప్పారు. అంతేకాదు ఈ సందర్భంగా మోడీ , రమాఫోసా ఇద్దరూ ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై తమ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.